ఇగ్లాండ్ గడ్డపై టెస్టు సిరీస్లో తొలి విజయానికి భారత్ జట్టు భారీ స్కోరుతో బాటలు వేసుకుంది. నాటింగ్హామ్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో.. మూడో రోజైన సోమవారం ఓవర్ నైట్ స్కోరు 124/2తో రెండో ఇన్నింగ్స్ను కొనసాగించిన భారత జట్టులో కెప్టెన్ విరాట్ కోహ్లి (103: 197 బంతుల్లో 10×4) శతకం బాదగా, పుజారా (72: 208 బంతుల్లో 9×4), హార్దిక్ పాండ్య (52: 52 బంతుల్లో 7×4, 1×6) బాధ్యతాయుత ఇన్నింగ్స్లు ఆడేశారు. దీంతో.. జట్టు 352/7తో నిలిచిన దశలో కెప్టెన్ కోహ్లి రెండో ఇన్నింగ్స్ను డిక్లేర్ చేశాడు.
తొలి ఇన్నింగ్స్లో భారత్కి 168 పరుగుల ఆధిక్యం లభించిన నేపథ్యంలో.. 521 పరుగుల భారీ లక్ష్యం ఇంగ్లాండ్ ముందు నిలిచింది. విరాట్ కోహ్లి శతకంతో మెరిశారు. మరో రెండు రోజుల ఆట మిగిలి ఉండగా.. పది వికెట్లు కూల్చితే విజయం భారత్ సొంతం అవుతుంది.
తొలి ఇన్నింగ్స్లో కొద్దిలో సెంచరీ చేజార్చుకున్న కోహ్లి రెండో ఇన్నింగ్స్లో శతకంతో సత్తా చాటాడు. దీంతో భారత్ ఏడు వికెట్ల నష్టానికి 352 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. రెండు ఇన్నింగ్స్లు కలిపి 200 పరుగులు చేసిన కోహ్లి ఈ సిరీస్లో ఇప్పటి వరకూ 440 పరుగులు చేశాడు. తద్వారా ఇంగ్లాండ్ గడ్డ మీద ఒక సిరీస్లో అత్యధిక పరుగులు చేసిన భారత కెప్టెన్గా విరాట్ రికార్డు క్రియేట్ చేశాడు. ఇప్పటి వరకూ ఈ రికార్డ్ అజారుద్దీన్ (426) పేరిట ఉంది. కోహ్లి మరో ఆరు పరుగులు చేస్తే టెస్టుల్లో 6000 పరుగుల మైలురాయిని చేరుకుంటాడు.
ఓ టెస్టు సిరీస్లో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా గడ్డ మీద అత్యధిక పరుగులు చేసిన భారత కెప్టెన్ కూడా కోహ్లినే కావడం విశేషం. 2014-15లో ఆస్ట్రేలియాపై 449 పరుగులు చేసిన విరాట్.. ఈ ఏడాది ఆరంభంలో సౌతాఫ్రికాలో 286 రన్స్ చేశాడు.
జట్టు స్కోరు 224 వద్ద తొలుత పుజారా ఔటవగా.. అనంతరం శతకం పూర్తి చేసుకున్న విరాట్ కోహ్లి 281 పరుగుల ఔటయ్యాడు. దీంతో.. భారత్ జట్టు ఇన్నింగ్స్ను డిక్లేర్ చేస్తుందని అంతా భావించారు. కానీ.. జట్టు స్కోరు 500+ చేరుకునే వరకూ వేచి చూసిన కోహ్లి.. ఆ తర్వాత హార్దిక్ పాండ్య దూకుడుగా ఆడుతుండటంతో.. అతని అర్ధశతకం పూర్తి అయిన తర్వాత డిక్లేర్ చేశాడు.