పరుగుల యంత్రం, భారత క్రికెట్ జట్టు సారథి విరాట్ కోహ్లీకి గాయమైంది. దీంతో ఆతిథ్య దక్షిణాఫ్రికాతో జరిగే రెండో టీ20లో అతడు ఆడటంపై ఇప్పుడు అనుమానం నెలకొంది. భారత్-దక్షిణాఫ్రికా మధ్య ఆదివారం జరిగిన తొలి టీ20లో కోహ్లీ గాయపడ్డాడు. దీంతో రెండో మ్యాచ్లో ఆడటం అనుమానమేనన్న వార్తలు వినిసించాయి. అయితే దీనిపై కోహ్లీ స్పందించారు.
తనకేం కాలేదని, రెండో టీ20 మ్యాచ్ కు అందుబాటులో ఉంటానని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తెలిపాడు. గాయం గురించి వివరిస్తూ, సింగిల్ కోసం ప్రయత్నించి అదుపుతప్పానన్నాడు. అదృష్టవశాత్తు కండరం మాత్రమే పట్టుకుందని తెలిపాడు. తానెంత వేగంగా నడుం వంచానో అందరికీ తెలుసని పేర్కొన్నాడు. అప్పుడే తొడ కండరం పట్టేసిందని చెప్పాడు. దాంతోనే తాను మైదానం వీడాల్సి వచ్చిందని వివరించాడు.
వైద్యుల వద్దకు వెళ్లి పరీక్షలు చేయించుకోవాలని నిర్ణయించుకున్నానని కోహ్లీ వెల్లడించాడు. రెండో టీ20కి అందుబాటులో ఉంటానని చెప్పాడు. కాగా, సౌతాఫ్రికా ఇన్నింగ్స్ 14వ ఓవర్ లో ఫీల్డింగ్ చేస్తుండగా చీలమండ గాయంతో కోహ్లీ మైదానం వీడాడు. డ్రెస్సింగ్ రూమ్ లో ఫిజియో ప్రాథమిక చికిత్స కూడా చేశాడు. ఐతే గాయం తీవ్రత కారణంగా తిరిగి ఫీల్డింగ్ కి రాకపోవడంతో ధోనీ ఆపద్ధర్మ కెప్టెన్ గా బాధ్యతలు స్వీకరించి, జట్టును విజయపథంలో నడిపించారు.