Sunday, May 12, 2024
- Advertisement -

సెంచ‌రీల‌తో చెల‌రేగిన కోహ్లీ, రోహిత్‌…విండీస్‌పై భారీ విజ‌యం

- Advertisement -

భారత్-విండీస్ మధ్య గువాహటిలోని బర్సపర క్రికెట్ స్టేడియంలో జరిగిన తొలి వన్డేలో భారత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కెప్టెన్ కోహ్లీ, రోహిత్ శ‌ర్మ ఇద్ద‌రూ సెంల‌చరీలతో వీర విహారం చేయ‌డంతో సునాయాసంగా విజ‌యం సాధించింది.వారిద్దరి దెబ్బకు భారీ లక్ష్యం కాస్తా చిన్నదైపోయింది. మరో 47 బంతులు మిగిలి ఉండగానే విజయం భారత్ చెంతకు చేరింది.

మొద‌ట టాస్ గెలిచి కోహ్లీ ఫిల్డింగ్ ఎంచుకున్నారు. విండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 322 పరుగులు చేసింది. భారత బౌలర్లు అడపాదడపా వికెట్లు తీస్తున్నా పరుగుల వేగం తగ్గకుండా విండీస్ బ్యాట్స్‌మెన్ జాగ్రత్త పడ్డారు. విండీస్ యువ బ్యాట్స్‌మన్ షిమ్రాన్ హెట్‌మయర్ 78 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్లతో 106 పరుగులు చేశాడు.

ఇతడికి తోడు ఓపెనర్ కీరన్ పావెల్ (39 బంతుల్లో 51; 6×4, 2×6), షాయి హోప్ (51 బంతుల్లో 32; 2×4), రోవ్‌మన్ పావెల్ (23 బంతుల్లో 22; 4×4) రాణించారు. ఆఖర్లో దేవేంద్ర బిషూ(26 బంతుల్లో 22; 2×4), కీమర్ రోచ్ (22 బంతుల్లో 26; 2×4) దూకుడుగా ఆటడంతో విండీస్ భారీ స్కోరు సాధించింది.భారత బౌలర్లలో చాహల్ 3 వికెట్లు పడగొట్టగా, షమీ, రవీంద్ర జడేజా చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. ఖలీల్ అహ్మద్‌కు ఓ వికెట్ దక్కింది

అనంత‌రం బ్యాటింగ్ ప్రారంభించిన భార‌త్ ఆదిలోనే ధావ‌న్ (4) వికెట్ కోల్పోయింది.అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ కోహ్లీ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. అతడికి రోహిత్ శర్మ పూర్తి సహకారం అందించాడు. చెత్త బంతులను బౌండరీలకు తరలిస్తూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. మొత్తం 107 బంతులు ఎదుర్కొన్న కోహ్లీ 21 ఫోర్లు, 2 సిక్సర్లతో 140 పరుగులు చేసి ఔటయ్యాడు.

అనంతరం రోహిత్ శర్మ 84 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో సెంచరీ చేశాడు. 246 పరుగుల భారీ భాగస్వామ్యం తర్వాత కోహ్లీ రెండో వికెట్‌గా నిష్క్రమించాడు. దేవెంద్ర బిషూ వేసిన ఇన్నింగ్స్ 33వ ఓవర్ చివరి బంతికి ముందుకెళ్లి ఆడాలని చూడగా.. కీపర్ హోప్ స్టంపింగ్ చేయగా కోహ్లీ పెవిలియన్ బాట పట్టాడు

అంబటి రాయుడు (22 నాటౌట్) తో కలిసి రోహిత్ భారత్‌ను విజయతీరాలకు చేర్చాడు. 42వ ఓవర్లో థామస్ బౌలింగ్‌లో హ్యాట్రిక్ ఫోర్లు కొట్టిన రోహిత్.. హేమరాజ్ వేసిన ఆ మరుసటి ఓవర్ తొలి బంతిని సిక్సర్‌గా మలిచి భారత్‌కు ఘన విజయం అందించాడు. ఐదు వన్డేల సిరీస్‌లో భారత్ 1-0తో ముందంజలో ఉంది. సెంచరీతో చెలరేగిన కోహ్లీ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. రెండో వన్డే ఈ నెల 24న విశాఖపట్టణంలో జరగనుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -