ఐదు వన్డేల సిరీస్లో భాగంగా వెస్టిండీస్తో చివరి మూడు వన్డేల కోసం తనని భారత జట్టులోకి ఎంపిక చేయకపోవడంపై మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మన్ కేదార్ జాదవ్ విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. తనను ఎందుకు ఎంపిక చేయలేదో తెలియదంటూ పేర్కొన్న జాదవ్.. ఇందుకు సంబంధించి ఎవరూ కనీసం సమాచారం కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో బీసీసీఐ దిగి వచ్చింది.
పరిస్థితి అర్థం చేసుకోవాలంటూ సూచించిన చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్.. జాదవ్ను 4, 5 వన్డేలకు ఎంపిక చేసిన బృందంలో తాజాగా చోటు కల్పించారు. ఈ మేరకు సవరణ అంటూ జాదవ్కు చివరి రెండు వన్డేల్లో అవకాశం ఇస్తున్నట్లు బీసీసీఐ ట్వీట్ చేసింది.
మరోవైపు వన్డే సిరీస్ తర్వాత జరగనున్న ట్వంటీ20 సిరీస్ నుంచి రెగ్యూలర్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి సెలెక్టర్లు విశ్రాంతి కల్పించారు. ఓపెనర్ రోహిత్ శర్మకు తాత్కాలిక కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు.
వెస్టిండీస్తో ట్వంటీలకు ఎంపికైన భారత ఆటగాళ్లు:
రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, దినేష్ కార్తీక్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), కృనాల్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, చాహల్, కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, ఖలీల్ అహ్మద్, ఉమేశ్ యాదవ్, షాబాజ్ నదీమ్