రెండేళ్ల నిషేధం తర్వాత మళ్లీ ఐపీఎల్ లో పునరాగమనం చేసిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ట్రోఫీని కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఫైనల్లో హైదరాబాద్ సన్రైజర్స్ జట్టును మట్టికరిపించి కప్ను గెలుచుకుంది. అద్భుతమైన ఫీల్డింగ్, బౌలింగ్ , బ్యాటింగ్తో ధోని సేన అభిమానుల మన్ననల్ని అందుకుంది. చెన్నైకి చేరుకున్న కింగ్స్ సేనకు బ్రహ్మరథం పట్టే రీతిలో అభిమాన లోకం ఆహ్వానం పలికింది.
ఈ నేపథ్యంలో ముంబై నుంచి జెట్ ఎయిర్ వేస్ విమానంలో సీఎస్కే జట్టు చెన్నైకు చేరుకుంది. విమానాశ్రయంలో ఆటగాళ్లకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. మరోవైపు చెన్నై క్రికెటర్లు తమ విమానంలో ప్రయాణిస్తుండటంతో విమాన సిబ్బంది ముందుగానే ఏర్పాట్లు చేసుకున్నారు. విమానంలో ఆటగాళ్లతో కలసి విమాన పైలట్, ఎయిర్ హోస్టెస్ లు కేక్ కట్ చేశారు. కప్ ను చేతిలో పట్టుకుని ఫొటోలు దిగారు. క్రికెటర్లతో సెల్ఫీలు దిగుతూ, సందడి చేశారు.