ఐపీఎల్ 2018 సీజన్లో బెంగులూరు రాయల్ చాలెంజర్స్ ను కష్టాలు వెంటాడుతున్నాయి. ఇప్పటి వరకు కోహ్లీసేన ఏమ్యాచ్లోనూ పోరాట పటిమను కనబరచలేదు. జట్టులో స్టార్ బ్యాట్స్మెన్లు ఉన్నా పేవలమైన ఆటతీరుతో అపజయాలను మూటగట్టుకుంది. ప్లే ఆఫ్ అవకాశాలను దాదాపు కోహ్లీసేన వదులు కున్నట్లే.
నేడు ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టుతో అమీతుమీ తేల్చుకొనేందుకు కోహ్లీసేన సిద్ధమయ్యింది. ఈ మ్యాచ్లో ఓడిపోతే బెంగళూరు రాయల్ చాలెంజర్స్ ఇంటికే. మంచి ఊపుమీద ఉండి వరుస విజయాలతో ప్లే ఆఫ్ అవకాశాలను దాదాపు ఖాయం చేసుకుంది హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టు.
వరుస ఓటములతో కొనసాగుతూ, ఆడిన 9 మ్యాచ్ లలో మూడే విజయాలతో ఆరో స్థానంలో ఉన్న బెంగళూరు రాయల్ చాలెంజర్స్ జట్టుతో తలపడనుంది. భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ నాయకత్వంలో బరిలోకి దిగే బెంగళూరు జట్టు, ఈ మ్యాచ్ లో చేతులెత్తేస్తే ఆ జట్టు ఇక ఇంటికే.
ఇప్పటికే తానాడిన తొలి మూడు మ్యాచ్ లు, ఆపై ఒక మ్యాచ్ ఓడిపోయినా, నాలుగు వరుస విజయాలతో ఉన్న హైదరాబాద్ జట్టు ఈ ఒక్క మ్యాచ్ గెలిస్తే ప్లే ఆఫ్ మ్యాచ్ లను ఖాయంగా ఆడుతుంది. ఇదే సమయంలో కోహ్లీ సేన తాను ఆడాల్సిన మిగతా 5 మ్యాచ్ లూ గెలిస్తే మాత్రమే ప్లే ఆఫ్ కు చేరుతుంది.