టీమిండియా-న్యూజిలాండ్ జట్ల మధ్యజరగనున్న చివరిదైన టీ 20 మ్యాచ్ రసకందాయంలో పడింది. ఇరు జట్లు చెరో మ్యాచ్గెలిచి సిరీస్ను 1-1 సమం చేశాయి. ఆఖరి టీ20 లో నువ్వా..నేనా అన్న విధంగా రెండు జట్లమధ్య ఆసక్తికరపోరు జరగనుంది. సిరీస్ను నెగ్గేందుకు ఇరు జట్లు వ్యూహాలు రచిస్తున్నారు.
చివిరి టీ20 మంగళవారం తిరువనంతపురంలోని గ్రీన్ ఫీల్డ్ అంతర్జాతీయ స్టేడియంలో జరగనుంది. రాత్రి గం.7.00ల.కు ఆరంభమయ్యే మ్యాచ్ లో ఇరు జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. వన్డే సిరీస్ ను శ్రమించి గెలిచిన విరాట్ సేనకు, టీ 20 సిరీస్ లో కూడా కివీస్ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. ఫిరోజ్ షా కోట్ల మైదానంలో జరిగిన తొలి మ్యాచ్ లో టీమిండియా సునాయాసంగా విజయం సాధిస్తే, రాజ్ కోట్ లో జరిగిన రెండో టీ 20ల్లో మాత్రం పూర్తిగా విఫలమై కివీస్ కు దాసోహమైంది. అన్ని విభాగాల్లోను భారత జట్టు పూర్తిగా విఫలం అయ్యింది.
స్వదేశంలో తిరుగులేదని మరోసారి చాటిచెప్పాలని భావిస్తున్న విరాట్ సేనకు ధోని బ్యాటింగ్ ఆర్డర్ పై ఆలోచనలో పడింది. తొలి టీ 20లో ఐదో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన ధోని.. రెండో టీ 20లో ఆరో స్థానంలో బ్యాటింగ్ కు దిగాడు. కీలకమైన మూడో టీ 20లో ధోనిని ఎక్కడ బ్యాటింగ్ పంపాలనే దానిపై జట్టు యాజమాన్యం తర్జన భర్జన పడుతోంది.
ఈ నేపథ్యంలో రేపటి మ్యాచ్ లో ధోని నాల్గో స్థానంలో బ్యాటింగ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరొకవైపు గత జట్టునే భారత కొనసాగించే అవకాశం ఉంది. ఒకవేళ బ్యాట్స్ మన్ ను అదనంగా వేసుకోవాలని భావిస్తే మాత్రం స్పిన్నర్ అక్షర్ పటేల్ కు విశ్రాంతి తప్పకపో్వచ్చు. ఆ స్థానంలో మనీష్ పాండే, దినేశ్ కార్తీక్ ల్లో ఒకరిని తుది జట్టులోచేర్చుకోవచ్చు.
అయితె మ్యాచ్ కు మాత్రం వరుణుడి ముప్ప పొంచి ఉంది. మ్యాచ్ జరుగుతుందా లేదా అని సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. వర్షం కురిసినా ఇబ్బందేమీ లేదని కేరళ క్రికెట్ సంఘం అధికారులు చెప్తున్నారు. తాము అన్నిటికీ సిద్ధంగా ఉన్నామన్నారు. ‘స్టేడియంలో అద్భుత మురుగునీటి పారుదల వ్యవస్థ ఉంది. సాయంత్రం వర్షం కురిస్తే ఆగిపోయిన 20 నిమిషాల్లోపే మైదానం సిద్ధం చేయగలమని కేరళ క్రికెట్ సంఘం కార్యదర్శి జయేశ్ జార్జ్ తెలిపారు. మరి విజయం ఎవరిని వరిస్తుందో…?