మొహాలీలో మోత మోగించింది భారత్. ఆసీస్తో జరిగిన తొలి వన్డేలో 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 277 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 48.4 ఓవర్లలో 281 పరగులు చేసి 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో మొహాలీ స్టేడియంలో ఆసీస్పై 13 ఏళ్ల తర్వాత గెలుపొందింది భారత్. భారీ లక్ష్యచేధనలో బరిలోకి దిగిన భారత్కు ఓపెనర్లు మంచి శుభారంభాన్ని అందించారు. శుభ్మన్ గిల్(74), రుతురాజ్ గైక్వాడ్(71) ధాటిగా ఆడారు. ఓ దశలో వీరిద్దరే టార్గెట్ని ఫినిష్ చేస్తారా అనిపించింది. అయితే ఊహించని విధంగా కేవలం 9 పరుగుల తేడాలో 3 వికెట్లు కొల్పోయింది. గిల్,గైక్వాడ్, శ్రేయాస్ అయ్యర్(3) వెంటవెంటనే వెనుదిరిగారు. అయితే ఈ దశలో భారత్ ఒత్తిడిలో పడగా కెప్టెన్ కేఎల్ రాహుల్ 58,సూర్య 50 పరుగులతో రాణించడంతో భారత్ విజయం ఖాయమైంది.
ఇక అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్..50 ఓవర్లలో 276 పరుగులకు ఆలౌటయ్యింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్(52), జోష్ ఇంగ్లిస్(45), స్టీవ్ స్మిత్(41), మార్నస్ లబూషేన్(39) మాత్రమే రాణించగా మిగితా బ్యాట్స్మెన్ విఫలమయ్యారు. ఇక ముఖ్యంగా పేసర్ షమీ దెబ్బకు ఆసీస్ విలవిలలాడింది. 5 వికెట్లు తీసి సత్తాచాటాడు షమీ. వన్డేల్లో ఐదు వికెట్లు తీయడం షమీకి ఇది రెండోసారి. ఈ విజయంతో దాయాది పాకిస్థాన్ను వెనక్కి నెట్టి భారత్ వన్డేల్లో నంబర్ 1 ర్యాంకు సొంతం చేసుకుంది.
