యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్ ఇంకా నిలకడమైన ప్రదర్శన చేయాలని మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ అన్నారు. సుధీర్ఘ ఇన్నింగ్స్ లో రాణించాలని.. సెలక్టర్లు పెట్టుకున్న నమ్మకంను నిలబెట్టుకోవాలని గంభీర్ సూచించారు. వెస్టిండీస్తో జరిగిన తొలి వన్డేలో పంత్ 71 పరుగులు చేశాడు.
ఈ నేపథ్యంలో గంభీర్ మాట్లాడుతూ.. “ఎంఎస్ ధోనీ ఎంత నిలకడగా జట్టు అవసరాలకు తగ్గట్లు ఆడేవాడో అదే తరహాలో రాణించడానికి పంత్ ప్రయత్నించాలి. ముఖ్యంగా 60 నుంచి 70 పరుగుల వ్యక్తిగత స్కోరును సెంచరీగా మలచుకోవాలి. అన్ని ఫార్మాట్లలో పంత్ ను తీసుకోవడానికి కారణం ఏంటో అర్దం చేసుకోవాలి. పంత్ పై నమ్మకంతోనే అవకాశాలు ఇస్తున్నారు.
ఇటీవల కాలంలో టెస్టు తుది జట్టులో పంత్ ఆడనప్పటికీ కనీసం రిజర్వ్ ఆటగాడిగానైనా పంత్ను కొనసాగిస్తుంది. అందుకు కారణం పంత్పై ఉన్న విపరీతమైన నమ్మకమే కారణం. దాన్ని కాపాడుకోవాలి. ఇక్కడ భారీ సెంచరీలు అవసరం లేదు.. ఎక్కువ సమయం క్రీజ్లో ఉండటానికి యత్నించాలి’ అని గంభీర్ తెలిపారు.
ధోనీ వారసుడిగా వచ్చిన పంత్.. అనతి కాలంలోనే ఆకట్టుకున్నప్పటికీ తర్వాత కాలంలో విఫలమై విమర్శలు ఎదుర్కున్నాడు. వరుస వైఫల్యాల తర్వాత వెస్టిండీస్తో మొదటి వన్డేలో పంత్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు.