కేప్ టౌన్ వేదికగా భారత్ తో జరుగుతున్న తొలి టెస్టులో సౌతాఫ్రికా విజయం సాధించింది. 208 పరుగుల టార్గెట్ తో రెండో ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన టీమిండియా 135 పరుగులకు ఆలౌట్ అయి 72 పరుగుల తేడాతో ఓటమిపాలయ్యింది . ఒక్క అశ్విన్ మినహా ఏ ఒక్క బ్యాట్స్ మెన్ క్రీజులో నిలబడలేకపోయారు. సౌతాఫ్రికా బౌలర్లలో ఫిలాండర్ 6 వికెట్లు పడగొట్టి.. సౌతాఫ్రికా విజయంలో కీలక పాత్ర వహించాడు. ఫిలాండర్ కు తోడు రబాడ, మోర్కెల్ తలో చెయి వేసి సౌతాఫ్రికాకు విజయం అందించారు.
టీమిండియా బౌలర్లు అద్భుతంగా రాణించినప్పటికీ బ్యాట్స్మెన్ ఏ మాత్రం రాణించలేకపోవడంతో.. దక్షిణాఫ్రికా విజయ దుందుభి మోగించింది. మొదటి ఇన్నింగ్స్ లో దక్షిణాఫ్రికా 286 పరుగులు, రెండో ఇన్నింగ్స్లో 130 పరుగులు చేసిన విషయం తెలిసిందే. మొదటి ఇన్నింగ్స్ లో టీమిండియా 209 పరుగులు చేసిన నేపథ్యంలో విజయానికి 208 పరుగులు మాత్రమే చేయాల్సి ఉండగా దక్షిణాఫ్రికా బౌలర్ల ధాటికి వరుసగా భారత బ్యాట్స్మెన్ ఔటయ్యారు.
భారత బ్యాట్స్మెన్లో మురళీ విజయ్ 13, శిఖర్ ధావన్ 16, పుజారా 4, విరాట్ కోహ్లీ 28, రోహిత్ శర్మ 10, వృద్ధిమాన్ సాహా 8, హార్దిక్ పాండ్యా 1, రవి చంద్రన్ అశ్విన్ 37, భువనేశ్వర్ కుమార్ 13 (నాటౌట్) , షమీ 4, బుమ్రా 0 పరుగులు మాత్రమే చేశారు. దీంతో టీమిండియా 72 పరుగుల తేడాతో ఓడిపోయింది. సెకండ్ ఇన్నింగ్స్ లో దక్షిణాఫ్రికా బౌలర్లలో ఫిలండర్ 6 వికెట్లు తీయగా, మార్కెల్, రబాడా రెండేసి వికెట్లు తీశారు.
