అక్టోబర్ 5 నుండి భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్ జరగనున్న సంగతి తెలిసిందే. ఆసియా కప్ గెలిచిన జోష్ మీదున్న భారత్..వన్డేల్లో టాప్ 1 ర్యాంకుతో ప్రపంచ కప్లో అడుగుపెట్టే అవకాశాలున్నాయి. ప్రస్తుతం పాకిస్థాన్ వన్డేల్లో టాప్ 1 ర్యాంకులో ఉంది. అయితే ఆసియా కప్ తర్వాత పాక్ షెడ్యూల్ ప్రకారం వన్డే మ్యాచ్లు లేవు.
ఐసీసీ ర్యాంకింగ్స్లో భారత్ రెండో స్ధానంలో ఉండగా ఆసీస్ మూడో స్థానంలో ఉంది. ఈ రెండు జట్లకు పాక్ మధ్య పెద్ద వ్యత్యాసం కూడా లేదు. ఆసియా కప్ విజేతగా నిలిచిన భారత్ వన్డేల్లో అగ్రస్థానానికి చేరువ కాగా ప్రపంచకప్కి ముందు భారత్ – ఆసీస్ మధ్య మూడు వన్డేల సిరీస్ జరగనుంది. దీంతో ఈ రెండు జట్లకు అగ్రస్ధానానికి చేరుకునేందుకు ఛాన్స్ ఉంది.
అంతేగాదు భారత్, ఆస్ట్రేలియా జట్లు మూడు వన్డే మ్యాచుల సిరీస్ తర్వాత ర్యాంకింగ్స్లో మార్పులు జరగడం ఖాయంగా కనిపిస్తోంది.పాకిస్తాన్ 114.899 రేటింగ్ పాయింట్లతో మొదటి ర్యాంకులో ఉండగా టీమిండియా 114.659 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ఆసీస్ ఖాతాలో 113 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి.దీంతో ఈ వన్డే సిరీస్ తర్వాత ర్యాంకింగ్స్లో తేడాతో భారత్ – ఆసీస్ రెండు జట్లలో ఒక టీమ్ టాప్ ర్యాంకింగ్తో ప్రపంచకప్లో అడుగుపెట్టే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.ప్రస్తుతం టెస్టులు, టీ20ల్లో భారత్ నంబర్ వన్ ర్యాంకులో కొనసాగుతున్న సంగతి తెలిసిందే.