కసిగా ఆడిన యువ టీమిండియా ముందు పటిష్టమైన ఆస్ట్రేలియా పసికూన అయ్యింది. భారత్ ఎంత ఆత్మవిశ్వాసంతో ఆడిందో.. ఆసీస్ అంత తడబాటుకు గురైంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. ఎందులోనూ పోటీయే లేదసలు. వెరసి పృథ్వీ షా నేతృత్వంలోని యువ భారత జట్టు వరల్డ్ కప్ను సాధించింది.
అండర్-19 ప్రపంచకప్లో ఆస్ట్రేలియాను మట్టికరిపించి నాలుగోసారి ప్రపంచకప్ టైటిల్ కైవసం చేసుకున్న యువ భారత్పై ప్రశంసల వర్షం కురుస్తోంది. టోర్నీలో ఓటమే ఎరుగని రీతిలో.. ఆ మాటకొస్తే ప్రత్యర్థులకు ఏ చిన్న అవకాశం ఇవ్వకుండా ప్రతి మ్యాచ్లో ఘనమైన విజయాలతో చరిత్ర సృష్టించడం పట్ల అభిమానుల గుండెలు ఉప్పొంగుతున్నాయి. పూర్తి ఆత్మవిశ్వాసంతో, అత్యంత క్రమశిక్షణతో పరిపూర్ణ విజయం సాధించేలా యువ క్రికెటర్లను తీర్చిదిద్దిన క్రికెట్ దిగ్గజం, అండర్-19 టీమ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పనితీరును కూడా మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు.
ఫైనల్లో ఆస్ట్రేలియాపై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన పృథ్వీషా సేనపై క్రికెట్ దేవుడు సచిన్ ప్రశంసలు కురిపించాడు. గొప్ప టీమ్ వర్క్తోనే పెద్ద లక్ష్యాలను అందుకోగలమని పేర్కొన్నాడు. ప్రపంచ ఛాంపియన్లను చూసి దేశం గర్వపడుతోందని ట్వీట్ చేశాడు.
యువ క్రికెటర్లకు సరైన మార్గనిర్దేశం చేసిన కోచ్ రాహుల్ ద్రవిడ్, బౌలింగ్ కోచ్ పారస్కు ప్రత్యేక అభినందనలు తెలిపాడు. భవిష్యత్తులో ఇదే ఆటతీరు కనబరిచి యువ క్రికెటర్లు మరిన్ని మంచి విజయాలు నమోదు చేయాలని ఆశిస్తున్నట్లు చెప్పాడు. యంగ్ క్రికెటర్లకు ఆల్ ది బెస్ట్ తెలిపాడు.
WITH GREAT TEAM WORK, BIG DREAMS WORK. Congratulations to our WORLD CHAMPIONS!! We are proud of you. A big congratulations to Rahul and Paras for their guidance. #ICCU19CWC #INDvAUS pic.twitter.com/w0heorY8g6
— Sachin Tendulkar (@sachin_rt) February 3, 2018