2007 టీ20 ప్రపంచకప్లో భాగంగా ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ వరుసగా ఆరు సిక్సర్లు కొట్టిన విషయం అందరికి తెలిసిందే. యువరాజ్ బాదుడికి అప్పటి యువ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ బలయ్యాడు. అయితే మరో ఇంగ్లండ్ బౌలర్ ఆండ్రూ ఫ్లింటాప్తో గొడవ జరిగిన తర్వాతే తనలో ఆవేశం పెరిగి 6 బంతుల్లో 6 సిక్స్లు కొట్టా అని యువీ పలుమార్లు చెప్పాడు. మరి ఆ గొడవకు కారణం ఏంటో యువరాజ్ తాజా ఫ్యాన్స్ తో పంచుకున్నాడు.
ఇన్స్టాగ్రామ్ లైవ్లో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్తో యువరాజ్ సింగ్ మాట్లాడుతూ… 2007 టీ20 ప్రపంచకప్ మ్యాచ్లో జరిగిన ఆ సంఘటనను గుర్తు చేసుకున్నాడు. అసలు ఆరోజు ఏం జరిగిందంటే.. ఫ్లింటాఫ్ వరుసగా రెండు మంచి బంతులు వేశాడు. అందులో ఒకటి యార్కర్. ఆ రెండు బంతుల్ని నేను ఫోర్లుగా మలిచా. దాంతో అసహనానికి గురైన ఫ్లింటాఫ్.. మరో ఎండ్కు నడుచుకుంటు వెళ్తున్న నాపై నోరుపారేసుకున్నాడు. అవి చెత్త షాట్స్ అని అవహేళనగా మాట్లాడాడు.
చాలా గంభీరంగా ఆ మాట అన్నాడు’ అని యువీ తెలిపాడు. ’ఫ్లింటాఫ్ అలా అనేసరికి నేను ఏం అన్లేదు. ఆపై నీ గొంతు కోస్తా అని హెచ్చరించాడు. నాకు అప్పుడు కోపం వచ్చింది. నాచేతిలో బ్యాట్ చూశావా, ఈ బ్యాట్తో నిన్ను ఎక్కడ కొడతానో తెలియదన్నా. ఆ తర్వాత ఓవర్లోనే నేను స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్లో వరుసగా ఆరు సిక్సర్లు కొట్టా. ఆరు సిక్సర్ల తర్వాత దిమిత్ మస్కరెనాస్ వైపు చూసి, ఆ తర్వాత ఫ్లింటాఫ్ వైపు చూశా. అప్పుడు నా కోపం చల్లారింది’ అని యువీ పేర్కొన్నాడు.