టీమిండియా దిగ్గజ మాజీ బ్యాట్స్మన్ యువరాజ్ సింగ్ మళ్లీ మైదానంలోకి అడుగు పెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. ముస్తాక్ అలీ ట్రోఫీ కోసం పంజాబ్ ఎంపిక చేసిన ప్రాబబుల్స్ జాబితాలో అతని పేరు ఉండటమే దీనికి కారణం. ఈ టోర్నీ కోసం 30 మందితో ప్రాబబుల్స్ జాబితాను ఇటీవల ప్రకటించారు. యువీ ఇప్పటికే మొహాలీలోని ఐఎస్ బింద్రా పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో నెట్ ప్రాక్టీస్ కూడా చేస్తుండటం విశేషం. మళ్లీ క్రికెట్ బ్యాట్ పట్టుకోవడం చాలా సంతోషంగా ఉందంటూ అతడు ఇన్స్టాగ్రామ్లో వీడియోను పోస్ట్ చేశాడు. ఈ నెల 18 నుంచి పంజాబ్ ప్లేయర్స్ కోసం లుధియానాలో ఏర్పాటు చేసిన క్యాంప్లోనూ యువీ పాల్గొననున్నాడు.
అనుమతి లభిస్తుందా?
అయితే, పంజాబ్ టీమ్కు యువీ ఆడతాడా లేదా అన్న విషయంపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. గతేడాది అంతర్జాతీయ క్రికెట్ నుంచి తాను రిటైరవున్నట్లు ప్రకటించిన యువీ.. తర్వాత కెనడాలో జరిగిన గ్లోబల్ టీ20 లీగ్ సహా పలు విదేశీ లీగ్స్లో ఆడుతున్నాడు. బీసీసీఐ నిబంధనల ప్రకారం యాక్టివ్ ప్లేయర్స్కు విదేశీ టీ20 లీగ్లలో ఆడేందుకు అనుమతి ఉండదు. ఇలాగే రిటైర్మెంట్ ప్రకటించి విదేశీ లీగ్లలో ఆడిన ప్రవీణ్ తంబెని ఐపీఎల్లో ఆడనివ్వలేదు. అయితే పీసీఏ సెక్రటరీ పునీత్ బాలి విజ్ఞప్తి మేరకు తన రిటైర్మెంట్పై పునరాలోచన చేస్తున్న యువీ.. అందుకు అనుమతి ఇవ్వాలంటూ బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, కార్యదర్శి జే షాను కోరాడు. వారి నుంచి ఇప్పటివరకైతే ఎలాంటి స్పందనా రాలేదు.