ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ ఘోరంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. మొదటి నుంచి మేమె ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ప్రగల్భాలు పలికిన పవన్ పార్టీ జనసేనను ప్రజలు తుంగలోకి తొక్కారు. ఎన్నికల్లో జనసేన ఓటమి.. తన రాజకీయ జీవితం.. పార్టీ పెట్టడానికి కారణాలు.. సినీ జీవితం గురించి తానా వేదికపై కీలక వ్యాఖ్యలు చేశారు
ఓడిపోతామని ముందే తెలుసునని వ్యాఖ్యలు చేసిన పవన్ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతంపై దృష్టి సారిస్తామని సెలవిచ్చారు. సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ ఓటమిని నేను అర్థం చేసుకుని బయటకు రావడానికి 15 నిమిషాలు మాత్రమే పట్టిందన్నారు. చిన్నప్పటి నుంచి నా ప్రతీ ఓటమి నన్ను విజయానికి దగ్గర చేసింది.. ఓటమికి చాలా కారణాలు ఉండొచ్చు.. ఓటమికి నేను ఎందుకు భయపడడం లేదంటే.. స్కామ్లు చేశో.. ద్రోహం చేశో రాజకీయాల్లోకి రాలేదు.. విలువల కోసం వచ్చా.. అది నాకు ఓటమి ఇస్తే సంతోషంగా స్వీకరిస్తానన్నారు.
ప్రతి ఓటమి నుంచి ఓ పాఠం నేర్చుకుంటున్నానని అన్నారు. జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయనున్నానని అన్నారు. కులాలు, మతాలు, ప్రాంతాలుగా ప్రజలు విడిపోరాదని పిలుపునిచ్చారు. మనుషులను కలిపేలా జనసేన రాజకీయాలు ఉంటాయని స్పష్టం చేసిన ఆయన, డబ్బులు లేకుండా రాజకీయాలు చేయడం కష్టమని తనకు తెలుసునన్నారు. జైలుకు వెల్లి వచ్చిన వారె బయట తిరుగుతున్నారని …నేను రాజకీయాల్లో కొనసాగితే తప్పేంటని పరోక్షంగా జగన్ పై వ్యాఖ్యలు చేశారు.
నాయకులు నియంతలుగా మారితే ప్రజలు గుణపాఠం చెబుతారని, చరిత్ర ఎన్నోమార్లు ఈ సత్యాన్ని చెప్పిందని, విలువలతో రాజకీయాలు చేయబట్టే జనసేన ఓడిపోయిందని అన్నారు. భావితరాల కోసం బలంగా తన వాణి వినిపించాలనే ఉద్దేశంతో పోరాటానికి సిద్ధమయ్యానని తెలిపారు. ఈ పోరాటంలో ఎదురుదెబ్బలు తగలొచ్చని, నలిగిపోవచ్చని అయినా సరే వెనుకడగు వేసే ప్రసక్తేలేదని పవన్ ఉద్ఘాటించారు.