Friday, April 26, 2024
- Advertisement -

ఉద్దానం సమస్యకు జగన్ శాశ్వత పరిష్కారం.. మేఘాతో ముందుకు..

- Advertisement -

ఉద్దానం.. గడిచిన కొన్ని దశాబ్ధాలకు పరిష్కారం లేని ఒక పెద్ద సమస్య. ఏపీలోని రాజకీయ నాయకులు.. ప్రభుత్వాలు మారినా దశమారని ఉద్దానం దీనగాథను ఎవరూ పట్టించుకోలేదు. చాలా మంది రాజకీయ నాయకులు ఉద్దానంతో రాజకీయం చేసి ఓట్లు సంపాదించుకొని కొందరు ట్విట్టర్ లో హల్ చల్ చేసి వదిలేసిన వారే కానీ ఎవరూ చిత్తశుద్ధితో దీన్ని పరిష్కరించిన దాఖలాలు లేవు.

గత చంద్రబాబు ప్రభుత్వంలో జనసేనాని పవన్ కళ్యాన్ ఈ ఉద్దానం సమస్యను లేవెనెత్తి కన్నీరు కార్చి చంద్రబాబుకు పరిష్కరించమన్నా ఆయన తూతూ మంత్రం హంగు ఆర్భాటాలు చేసి ఉద్దానం బాధితులను గాలికి వదిలేశాడు.

కానీ ఇప్పుడు ఏపీ సీఎం జగన్ సంకల్పించారు. చంద్రబాబు, పవన్ ల ప్రచార ఆర్భాటం చేసి ఉద్దానం బాధితులను వదిలేయకుండా ఏకంగా నిధులు కేటాయించి మరీ ప్రతిష్టాత్మక సంస్థకు కాంట్రాక్ట్ ఇచ్చి ఉద్దానం తలరాత మార్చేందుకు సిద్ధమయ్యారు.

ఉద్దానం బాధితులను ఆదుకునేందుకు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం నడుం బిగించింది. యుద్ధ ప్రతిపాదికన శుద్ధి చేసిన తాగునీటిని అందించి వ్యాధికి శాశ్వత విరుగుడు కనిపెట్టింది. ఉద్దానం కిడ్ని సమస్యకు శాశ్వత పరిష్కారంగా మేలైన తాగునీటి పథకాన్ని మందుగా ముందుకు తీసుకువచ్చింది. ఏమాత్రం హడావుడి, ఆర్భాటం లేకుండానే సమగ్ర తాగునీటి పథకం అమలు చేసేందుకు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏకంగా కార్యాచరణతో రంగంలోకి దిగిపోవడం సంచలనంగా మారింది.

సీఎం జగన్ ఎన్నో ఏళ్లుగా పరిష్కారానికి నోచుకోకుండా ఉన్న సమస్యలపై దృష్టాసారించారు. ఇందులో భాగంగానే సీఎం జగన్ ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు శ్రీకారం చుట్టారు. సాగునీటి రంగంలో అద్భుతాలు సృష్టిస్తున్న మేఘా సంస్థ సహకారంతో ఉద్దానంలో మంచినీటి పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ పథకం త్వరగా పూర్తి చేయడం ద్వారా ఉద్దానం కిడ్నీ బాధితులకు జగన్ సర్కార్ అండగా నిలువనుంది.

గత ప్రభుత్వాలకు భిన్నంగా జగన్ సర్కార్ చిత్తశుద్ధితో ఉద్దానం బాధితులకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ముందుకొచ్చింది. ఉద్దానంలో శాశ్వత తాగునీటి పథకాన్ని ఏర్పాటు చేయటంతోపాటు, పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు శ్రీకారం చుట్టారు. రూ. 700కోట్ల అంచనాలతో ఈ పథకాన్నిడిజైన్ చేసి రూ.530కోట్లతో పనులకు అధికారులు టెండర్లు పిలిచారు. రివర్స్ టెండరింగులో రూ.527 కోట్లతో పనులు చేసేందుకు మేఘా ఇంజనీరింగ్ సంస్థ ముందుకు వచ్చింది. ఇది నిర్ణయించిన ధర కంటే 0.60 శాతం తక్కువ. ఉద్దానం ప్రాంత ప్రజల ఏడాది కాలం తాగునీటి అవసరాల కోసం 1.12 టీఎంసీల నీటిని ఈ ప్రాజెక్ట్ ద్వారా అందించనున్నారు.

ఉద్దానంలో కిడ్నీ బాధితులను ఆదుకునేందుకు జగన్ సర్కార్ చేపడుతున్న మంచి నీటి పథకం పనులను త్వరలోనే ప్రారంభించేందుకు మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ ఫ్రాస్టక్చర్ లిమిటెడ్ ( ఎంఈఐఎల్) సన్నాహాలు చేస్తోంది. ఏపీ ప్రభుత్వంతో కలిసి మేఘా ఇంజనీరింగ్ ఉద్దానం సమస్యకు శాశ్వత పరిష్కారం త్వరలోనే చూపించనుంది. మేఘా సంస్థ ఇప్పటికే తాగునీటి రంగంలో అనేక ప్రపంచస్థాయి రికార్డులను నెలకొల్పింది. నిర్ణిత సమయంలో అతిపెద్ద ప్రాజెక్టులు పూర్తిచేసిన రికార్డు మేఘా పేరిట ఉంది. దీంతో ఈ పథకం కూడా నిర్ణీత గడువులోగా నాణ్యత ప్రమాణాలతో పూర్తి చేస్తుందని ఏపీ ప్రభుత్వ అధికారులు ఎంతో నమ్మకంతో ఉన్నారు. ఉద్దానం బాధితుల సమస్యలు తీర్చడంలో మేఘా సంస్థ ఖచ్చితంగా త్వరితగతిన పనిచేస్తుందన్న నమ్మకం ప్రభుత్వంలో బాధితుల్లో ఉంది.

ఉద్దానంలోని 809 నివాసిత ప్రాంతాల్లో 5.74లక్షల మంది నివసిస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడి ప్రజలు తాగునీటి అవసరాలకు ఎక్కువగా బోరు నీటిపై ఆధారపడుతున్నారు. ఈ ప్రాంత భూగర్భ జలాల్లో కిడ్నీ వ్యాధి ప్రబలే అవకాశం ఉన్న కారకాలు ఉన్నట్టు నిపుణుల పరిశీలనలో వెల్లడైంది. సమీపంలో ఉండే బహుదా, మహేంద్ర తనయ నదులు వేసవిలో ఎండిపోతుండడం వల్ల బోరు నీటినే తాగక తప్పని పరిస్థితి. ఈ సమస్య పరిష్కారానికి మేఘా ఇంజనీరింగ్ ఉద్దానానికి దాదాపు వంద కిలో మీటర్ల దూరంలో ఉన్న హీరమండలం రిజర్వాయర్‌ నుంచి భూగర్భ పైపులైను ద్వారా నీటిని తరలించనుంది. మిలియకుట్టి మండల కేంద్రం వద్ద ఆ నీటిని ఇసుక ఫిల్టర్ల ద్వారా శుద్ధిచేసి ఆ నీటిని ఉద్దానం ప్రాంతంలోని వివిధ గ్రామాల్లో ఏర్పాటు చేసిన రక్షిత మంచినీటి ఓవర్‌హెడ్‌ ట్యాంకులకు తరలిస్తారు. వీటి ద్వారా ప్రతీ ఇంటికి ఈ నీటిని అందిస్తారు.

ఇప్పటి వరకు హార్వర్డ్ విశ్వ విద్యాలయ బృందం, ఎన్జీఆర్ఐ, బాబా అణు పరిశోధనా కేంద్రం, ఆంధ్ర విశ్వ విద్యాలయం, ఆంధ్ర మెడికల్ కాలేజ్, ఐసీఎంఆర్, పలు ప్రైవేట్ సంస్థలు ఉద్దానం సమస్య పై అధ్యనం చేసాయి. అయితే ఏ ఒక్కరు కూడా సమస్యకు మూల కారణం మాత్రం కనుక్కోలేక పోయారు. ఉద్దానంలో ప్రతీ వంద మందిలో 35నుంచి 40మంది కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఉన్నారంటే సమస్య తీవ్రత యెంత ఎక్కువగా ఉందో అర్థం చేసుకోవచ్చు. 17మొబైల్ కేంద్రాల ద్వారా ఉద్దానం విస్తరించి ఉన్న పలు ప్రాంతాల్లో కిడ్నీ వ్యాధి గ్రస్తులను గుర్తించేందుకు పరీక్షలు చేశారు.

శ్రీకాకుళం జిల్లాలోని పలాస, ఇచ్చాపురం నియోజకవర్గాల్లోని రెండు పురపాలక సంఘాలతో పాటు, కవిటి, సోంపేట, కంచిలి, ఇచ్చాపురం, పలాస, వజ్రపుకొత్తూరు, మందస మండలాల్లో ఈ కిడ్నీ బాధితుల సమస్య ఎక్కువగా ఉంది. 107 గ్రామాల్లో 1.3లక్షల జనాభాను పరీక్షిస్తే 14 వేల మంది కిడ్నీ బాధితులు తేలారు. కవిటి మండలం లో కిడ్నీ బాధితుల సంఖ్యా ఎక్కువగా ఉంది. ఉద్దానం లో కిడ్నీ సమస్య వెలుగులోకి వచ్చిన తరువాత ఇప్పటి వరకు 10వేల మంది మరణించి ఉంటారని ఈ సమస్య శాశ్వత పరిష్కారానికి ప్రయత్నిస్తున్న వారి అంచనా. ఉద్దానం పరిధిలోని ప్రతీ గ్రామం లో రెండు రోజులకు ఒకరు కిడ్నీ సమస్య తో మరణిస్తుంటారని ఓ అంచనా. వీటన్నింటిని పరిశీలించి సీఎం జగన్ సమస్యను తీవ్రతను గుర్తించారు. బాధితుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా జగన్ సర్కార్ మంచినీటి పథకానికి శ్రీకారం చుట్టింది. వీలైనంత త్వరగా మేఘా సంస్థ ఈ పథకాన్ని పూర్తి చేయడం ద్వారా దశాబ్దాలుగా ఉద్దానం బాధితులు అనుభవిస్తున్న బాధకు శాశ్వతంగా మోక్షం లభించనుండటంపై బాధిత గ్రామాల్లో సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -