నిర్భయ, దిశా, ఉన్నావో, హత్రాస్ ఇలా పేర్లు మారుతున్న ఆడవారిపై జరుగుతున్న అఘాయిత్యాలు మారడం లేదు. రోజుకో రకంగా కామాంధులు ఆడవారిని హింస పెడుతూనే ఉన్నారు.. పైవాటన్నిటికంటే క్రూరంగా హత్రాస్ సంఘటన జరిగిందనడంలో ఎలాంటి సందేహం లేదు.. ఒక అమ్మాయి ని అత్యంత దారుణంగా రేప్ చేసి ఆ తర్వాత ఆమె నాలుక కోసి చిత్ర హింసలకు గురి చేసి మరీ చనిపోయేలా చేశారు.. దాంతో మరొకసారి దేశంలో ఆడవారికి రక్షణ లేదు అనే విషయం బట్టబయలు అయినట్లు అయ్యింది..
ఉత్తరప్రదేశ్ లోని హత్రాస్ లో జరిగిన అత్యాచార ఘటన తీవ్ర కలకలం రేపుతున్న వేళ, బాధితురాలికి న్యాయం చేయాలన్న డిమాండ్ వెల్లువెత్తుండగా, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయ్ వర్గియా నిందితులను ఎన్ కౌంటర్ చేయవచ్చన్న సంకేతాలిస్తూ, మాట్లాడిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. బాధితురాలికి న్యాయం జరగాలంటే, నిందితుల ఎన్ కౌంటర్ ఒక్కటే మార్గమని ప్రజలు అభిప్రాయపడుతున్న సమయంలో, ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
ఈ దారుణ ఘటనపై స్పందించిన కైలాష్ విజయ్ వర్గియా, “నిందితులను ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. కేసు విచారణను ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు కూడా అప్పగించారు. ఈ రాష్ట్రానికి యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రని గుర్తుంచుకోండి. ఆయన పాలనలో ఓ కారు ఎప్పుడైనా, ఎక్కడైనా బోల్తా పడగలదన్న సంగతి నాకు తెలుసు” అంటూ ఎన్ కౌంటర్ జరిగే చాన్స్ ఉందన్న హింట్ ఇచ్చారు. ఆ వీడియోను మీరూ చూడవచ్చు.