హైదరాబాద్: నోట్ల రద్దు నిర్ణయాన్ని సడెన్గా ప్రకటించి ప్రధాని నరేంద్ర మోడీ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తనకు 50 రోజుల వ్యవధి ఇవ్వాలని , ప్రజలు సహకరించాలని సమస్యలన్నింటినీ పరిష్కారం అవుతాయని గోవాలో మాట్లాడిన మోదీ అన్నారు. నల్లధనం పోగేసుకున్న అవినీతిపరుల భరతం
పడతానని, 70 ఏళ్ల నుంచి పేరుకున్న చెత్త మొత్తాన్ని క్లీన్ చేస్తానని ఆయన అన్నారు. అయితే మరో పక్క మాత్రం సామాన్య ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవడం చూస్తూనే ఉన్నాం. అందరికీ ఇది ఒక షాకింగ్లా మారింది. పలు బీజేపీయేతర రాష్ట్ర ముఖ్యమంత్రులు వ్యతిరేకిస్తున్నారు. వారంతా ఏకమై మోదీకి వ్యతిరేకంగా ముందుకెళ్లేందుకు ప్రయత్నాలు కూడా చేస్తున్నారు.
అయితే ఈ నేపథ్యంలో మోదీ నిర్ణయం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. నిజానికి ఈ విషయంపై ఆయన అంతకుముందు గవర్నర్ను కూడా కలిసిన విషయం తెలిసిందే. నోట్ల రద్దు నిర్ణయంతో తలెత్తిన ఇబ్బందులు, అందుకు చెపట్టాల్సిన కార్యాచరణ గురించి ప్రతిరోజు సంబంధిత అధికారులతో ఆయన సమావేశం నిర్వహించి పలు విషయాలను, పర్యవసానాలను ఆయన వారితో చర్చిస్తున్నారు. రాష్ట్రం చాలా ఆదాయం కోల్పోతుందని, తాము పెట్టుకున్న భారీ అంచనాలన్నీ తలకిందులయ్యాయని కెసీఆర్ అన్నారు. ప్రజలు నిత్యావసరాల నిమిత్తం డబ్బుల కోసం బ్యాంకుల చుట్టు తిరుగుతున్నారని ఇది ఓ దిక్కుమాలిన నిర్ణయం అంటూ అసహనం వ్యక్తం చేసినట్టు కూడా పలు వార్తలొచ్చాయి.
