జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఆదేశాలు అమలు చేస్తూ పశ్చిమగోదావరి జిల్లా సమీపం లో నిర్మితం అవుతున్న గోదావరి మెగా ఆక్వా ఫుడ్ పార్క్ గ్రామాల కి జనసేన బృందం వెళ్ళింది. ఆ ప్రాంతం మొత్తం పర్యటించి అక్కడ పరిస్థితి ని అర్ధం చేసుకునే ప్రయత్నం చేసింది. జనసేన కోశాధికారి రాఘవయ్య తో పాటు మీడియా విభాగం అధిపతి హరి ప్రసాద్ పార్టీ ఉపాధ్యక్షులు మహేందర్ రెడ్డి ఈ బృందం లో సభ్యులు గా ఉన్నారు.
ఆక్వా ఫుడ్ పార్క్ పట్ల సమీప గ్రామాల ప్రజల నుంచి విపరీతమైన వ్యతిరేకత ఉండడం దానికి పవన్ సపోర్ట్ గా నిలవడం తెలిసిందే. ఇక్కడ వాస్తవ పరిస్థితులపై అధ్యయనం చేసేందుకు ఈ బృందం ఇక్కడ పర్యటించిందని జనసేన అధికారికంగా విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. జనసేన కమిటీ ముందర లోకల్ ప్రజలు అందరూ తమ సమస్యలు ఏకరువు పెట్టారు. ప్రాణాలైనా సైతం గానీ ఆక్వా ఫుడ్ పార్క్ నిర్మాణం జరిగితే ఒప్పుకోము అంటున్నారు వారందరూ.
ప్రాజెక్ట్ ని ఆనుకుని సముద్ర తీరం లో యాజమాన్యానికి రెండొందల ఎకరాల స్థలం ఉన్నా కూడా కావాలనే జనాల మధ్యలో ఇది కట్టాలి అని చూస్తున్నారు అని వారు వాపోతున్నారు. తమ ఇబ్బందులు జనసేనాని పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లాకే తాము కొంత ప్రశాంతంగా ఉండగలుగుతున్నామని బాధితులు తెలిపారని జనసేన ప్రకటన వివరించింది. అంతకు ముందు తమ గ్రామాల్లో అప్రకటిత కర్ఫ్యూ వాతావరణం నెలకొని ఉండేదని – ఎవరి గ్రామంలోకి వారు వెళ్లాలన్నా ఆధార్ కార్డులు చూపించాల్సి వచ్చేదని వాపోయారు.