దేశాన్ని వణికించిన కరోనా మహమ్మారిని ఎదుర్కొనే సమయం వచ్చేసింది. శనివారం నుంచి దేశవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభంకానుంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేతుల మీదుగా టీకా పంపిణీ ప్రక్రియ ప్రారంభం కానుంది. తెలంగాణలో తొలి రోజు 140 కేంద్రాలలో వ్యాక్సిన్ను పంపిణీ చేయనున్నారు. ఒక్కో కేంద్రంలో 30 మందికి మించకుండా తొలిరోజు 4,170 మంది టీకా వేస్తారు.
తొలి దశలో ప్రభుత్వం మూడు కోట్ల మంది హెల్త్ వర్కర్లు, ఫ్రంట్ లైన్ వారియర్లకు టీకా అంద జేస్తుంది. ఆ తర్వాత విడతల వారీగా ప్రజలందరికీ వ్యాక్సిన్ అందేలా చర్యలు చేపడుతుంది. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నిమ్స్లో, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ గాంధీ ఆసుపత్రిలో, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తిలక్నగర్లోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో టీకా పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.
అంతే కాదు జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు ఇంకా ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా టీకా పంపిణీ కార్యక్రమం ప్రారంభం అవుతుంది. కాగా, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని మోదీ.. ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభిస్తారు.