ప్రముఖ సినీ నటుడు.. నందమూరి నటవారసుడు.. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తానేంటో చూపిస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిని సంబంధించిన ఓ ఆడియో సంభాషణ టేపు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఇప్పుడు నందమూరి అభిమానులతో పాటు నెటిజన్లు, రాజకీయ నాయకులు దీనిపై తెగ చర్చించుకుంటున్నారు.
సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న ఆ ఆడియో టేపు ప్రకారం.. ఏపీలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో నెల్లూరు నగర నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి బాలయ్య ఫోన్ చేసి మాట్లాడారు. పంచాయతీ ఎన్నికలు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై అరా తీశారు. ఈ క్రమంలోనే బాలయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుతం తాను నటిస్తున్న బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో వస్తున్న సినిమా తరువాత నేనేంటో చూపిస్తా నంటూ సంచలన కామంట్స్ చేశారు. ఆయన ఎందుకు ఇలా అన్నారనే దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. అలాగే, రాష్ట్ర పాలన గురించి కూడా ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని ఆరోపించారు. యూపీ, బీహార్ వంటి రాష్ట్రాల్లో అరాచకాల గురించి వింటుంటాం, కానీ నేడు వైకాపా ప్రభుత్వంలో ప్రత్యక్షంగా చూస్తున్నామని ఆయన ఆరోపించారు. త్వరలోనే రాష్ట్ర ప్రజలకు చేరువలో వుంటానని బాలయ్య తెలిపారు.