ఈ మద్య పట్టణాల్లోనే కాదు గ్రామ స్థాయిల్లో కూడా గన్ కల్చర్ విపరీతంగా పెరిగిపోతుంది. తాజాగా కడప జిల్లా పులివెందులలో కాల్పుల కలకలం నెలకొంది. మండలంలోని నల్లపురెడ్డి పల్లిలో పార్థసారధి రెడ్డి అనే వ్యక్తిని శివప్రసాద్రెడ్డి గన్తో కాల్చి చంపి.. తర్వాత తాను కూడా గన్తో కాల్చుకొని చనిపోయాడు. ఆస్తి తగాదాలు ఇద్దరు వ్యక్తుల మరణానికి దారితీశాయి. గ్రామంలో ఎదురెదురు ఇళ్లల్లో నివాసం ఉంటున్నారు. ఈరోజు ఉదయం 8 గంటల సమయంలో పార్ధసారధి రెడ్డి కత్తితో ప్రసాద రెడ్డిపై దాడికి చేసేందుకు యత్నిస్తుండగా… ప్రసాద రెడ్డి తన వద్ద ఉన్న లైసెన్స్డ్ రివాల్వర్ తో పార్ధసారధి రెడ్డిపై కాల్పులు జరిపాడు.
పార్ధసారధి రెడ్డి శరీరంలోకి రెండు బుల్లెట్లు తగిలాయి. పార్ధసారధి రెడ్డి కుప్పకూలి పోవడంతో తాను కూడా కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. గ్రామంలో పెద్ద మనిషిగా చలామణి అవుతున్న ప్రసాదరెడ్డి, గతంలో పార్ధసారధి రెడ్డి కుటుంబం భార్యా భర్తల విషయంలో పంచాయతీ చేసినట్లు తెలుస్తోంది.
ఇక ఆ పంచాయతీలో తనకు అన్యాయం జరిగిందని భావించిన పార్ధసారధి రెడ్డి, శివప్రసాదరెడ్డిపై కక్ష పెంచుకుని ఈరోజు ఉదయం దాడిచేసేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. పులివెందుల ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం కావడం గమనార్హం.