రాజకీయాల్లోకి వచ్చిన పదేళ్లలోపే సీఎం అయిన వారిలో జగన్ ఒకరు. అతి చిన్న వయసులోనే ఏపీకి ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. పదేళ్ల లోపే సీఎం పీఠం అందుకున్నా.. ఆయనకు ఆ పదవి అంత సులువుగా అందలేదు. ఇందుకోసం జగన్ రాత్రనక పగలనక కష్టపడ్డారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఒంటరిగా బయటికి వచ్చి వైసీపీని స్థాపించి, దానిని నిలబెట్టడమే కాక సుదీర్ఘ పాదయాత్ర నిర్వహించి పార్టీని అధికారంలోకి తెచ్చి ముఖ్యమంత్రి అయ్యారు.
పార్టీని స్థాపించిన కొన్ని నెలల్లోనే జరిగిన ఉప ఎన్నికల్లో జగన్ తన సత్తా చాటి 18 సీట్లు గెలుచుకున్నారు. ఆ తరవాతి అసెంబ్లీ ఎన్నికల్లో 67 స్థానాల్లో విజయం సాధించి ప్రతిపక్ష నేతగా ఎదిగారు. 2019 లో జరిగిన సాధారణ ఎన్నికల్లో కనీవినీ ఎరుగని రీతిలో విజయం సాధించారు. ఏకంగా ఏపీలో 175 స్థానాలకు 151 స్థానాలు సాధించి ప్రత్యర్థులు సైతం నివ్వెరపోయేలా చేశారు. జగన్ విజయాలు, ఆయన జనాల్లో మాస్ లీడర్ గా ఎదిగిన వైనంపై ప్రస్తుతం బయోపిక్ రానుంది.
యాత్ర సినిమా ద్వారా వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ ని ఎంతో చక్కగా మలిచి మంచి పేరు సంపాదించుకున్న మహి వి. రాఘవ తన రెండో సినిమాగా జగన్ బయోపిక్ చేయనున్నట్లు సమాచారం. పార్టీని స్థాపించి లీడర్ గా జగన్ ఎదిగిన తీరు, సీఎంగా ఆయన ప్రయాణం వంటి అంశాల ఆధారంగా కథను రూపొందించినట్లు తెలుస్తోంది. జగన్ పాత్రలో ‘స్కామ్ 1992’ నటుడు ప్రతీక్ గాంధీ నటించనున్నట్లు సమాచారం. ఇప్పటికే యాత్ర బయోపిక్ ద్వారా పేరు తెచ్చుకున్న డైరెక్టర్ మహి వి. రాఘవ జగన్ బయోపిక్ ని ఎలా తెరకెక్కిస్తాడా అని సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Also Read: అన్నాడీఎంకేలో శశి ‘కలకలం’… చిన్నమ్మ పాచికలు పారతాయా?