తెలంగాణలో రాజకీయం వేడెక్కింది. టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియామకం కావడం, వైఎస్ఆర్ తనయ షర్మిల వైఎస్సార్ టీపీ పార్టీ ప్రకటించడం. బీజేపీ అధ్యక్షుడు సంజయ్ పాదయాత్ర చేస్తామని ప్రకటించడంతో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఇక ఇటీవల తన పార్టీని ప్రకటించిన షర్మిల వ్యూహాత్మకంగా దూసుకుపోతున్నారు. ప్రతి మంగళవారం నిరుద్యోగుల కోసం దీక్ష చేస్తానని షర్మిల ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా ఇవాళ వనపర్తి జిల్లా గోపాల్పేట మండలం తాడిపత్రి గ్రామంలో షర్మిల దీక్షను ప్రారంభించారు.
తాడిపత్రి గ్రామానికి చెందిన నిరుద్యోగి కొండల్ ఇటీవల ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో షర్మిల ఈ గ్రామాన్ని ఎంచుకున్నారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ దీక్ష కొనసాగుతున్నది. ఇక అక్కడ పార్టీ నేత కొండా రాఘవరెడ్డి ఏర్పాట్లు చేస్తున్నారు. షర్మిల వెంట ఆమె అనుచరులు, వైఎస్సార్టీపీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్పై విమర్శలు గుప్పించారు. గతంలో దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానన్న సీఎం కేసీఆర్ మాట తప్పారని.. ఇప్పుడు ఆయన ముక్కు నేలకు రాస్తాడా? అంటూ ఆమె ఫైర్ అయ్యారు.
ఈ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యపై తొలిసారిగా స్పందించింది వైఎస్సార్ టీపీయేనని ఆమె పేర్కొన్నారు. అంతేకాక తన పోరాటం వల్లే సీఎం కేసీఆర్ ఉద్యోగ నోటిఫికేషన్ వేశారని చెప్పుకొచ్చారు. ఇక సభకు వివిధ గ్రామాల ప్రజలు, వైఎస్సార్ అభిమానులు హాజరయ్యారు. షర్మిల ప్రధానంగా సీఎం కేసీఆర్ టార్గెట్గా ఆరోపణలు చేస్తున్నారు. మరోవైపు రాజకీయ సలహాదారు ప్రియ సూచనల మేరకు ఈమె దీక్షలు చేయాలని నిర్ణయించుకున్నట్టు టాక్.
Also Read