తల్లిదండ్రులను సరిగా పట్టించుకోకపోతే, మీరు ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా అది వ్యర్థమేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కన్న తల్లిదండ్రులను, పుట్టి పెరిగిన ఊరును ఎప్పటికీ మర్చిపోవద్దని ఆయన విద్యార్థులకు హితవు పలికారు. జీవితం లో ఎదగాలంటే విలువలు, బాధ్యత భావం అత్యంత ముఖ్యమని తెలిపారు.
మహబూబ్నగర్ జిల్లా పర్యటనలో భాగంగా జడ్చర్ల మండలం చిట్టెబోయినపల్లిలో నిర్మించనున్న మహబూబ్నగర్ ట్రిపుల్ఐటీ క్యాంపస్కు భూమి పూజ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తన రాజకీయ ప్రయాణాన్ని గుర్తు చేసుకున్న సీఎం, 17 ఏళ్ల వ్యవధిలో దేశంలోని అన్ని చట్టసభల్లో పనిచేసిన అనుభవం తనకు ఉందని తెలిపారు. సక్సెస్ కావాలంటే ముఖ్యంగా పట్టుదల అవసరమని, కమ్యూనికేషన్ స్కిల్స్, నాలెడ్జ్తో పాటు చిత్తశుద్ధి ఉంటేనే జీవితంలో నిజమైన ఎదుగుదల సాధ్యమవుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి మాట్లాడుతూ, జడ్చర్లలో జైలు కాదని ట్రిపుల్ ఐటీ కావాలంటూ ప్రజలు, విద్యార్థులు పట్టుదలగా పోరాడారని చెప్పారు. మాకు విద్యే ప్రాధాన్యం అని అప్పుడూ చెప్పాం, ఇప్పుడూ చెబుతున్నాం అని అన్నారు. విద్యార్థులంతా కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆయన ఆకాంక్షించారు.
