ఐపీఎల్ 2026 సీజన్ నుండి గాయం కారణంగా తప్పుకున్న ఇంగ్లాండ్ అంతర్జాతీయ ఆటగాడు బ్రైడన్ కార్సే స్థానంలో, శ్రీలంక బౌలర్ దిల్షాన్ మధుశంకను సన్రైజర్స్ హైదరాబాద్ ఎంపిక చేసుకుంది. మధుశంక తన బేస్ ప్రైస్ రూ. 75 లక్షలకు జట్టుతో చేరనున్నాడు.
టాటా ఐపీఎల్ 2026లో మిగిలిన మ్యాచ్ల కోసం బ్రైడన్ కార్సే స్థానంలో దిల్షాన్ మధుశంకను సన్రైజర్స్ హైదరాబాద్ ఎంపిక చేసింది. గాయం కారణంగా కార్సే ఈ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు అని ఐపీఎల్ ఒక ప్రకటనలో తెలిపింది.
శ్రీలంక తరపున 1 టెస్ట్, 28 వన్డేలు, 19 టీ20లు ఆడాడు.అంతర్జాతీయ క్రికెట్లో మొత్తం 70 వికెట్లు పడగొట్టాడు.గతంలో ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ (MI) జట్టులో సభ్యుడిగా ఉన్నాడు.
ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందే నెట్స్లో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో కార్సే బౌలింగ్ చేసే చేతికి గాయమైంది. దీనివల్ల ఆయన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన తొలి మ్యాచ్తో పాటు తర్వాతి నాలుగు మ్యాచ్లకు కూడా దూరమయ్యాడు. వాస్తవానికి కార్సే త్వరగా కోలుకుంటాడని హెడ్ కోచ్ డానియల్ వెట్టోరి భావించినప్పటికీ, వాపు తగ్గకపోవడంతో బంతిని పట్టుకోవడం అతనికి కష్టంగా మారింది. దీంతో చేసేదేమీ లేక ఆయన ఈ సీజన్ నుండి తప్పుకోవాల్సి వచ్చింది.
గమనించదగ్గ విషయం ఏమిటంటే, కార్సే గత ఏడాది (IPL 2025) కూడా కాలి బొటనవేలి గాయం కారణంగా టోర్నీకి దూరమయ్యాడు. అప్పుడు ఆయన స్థానంలో దక్షిణాఫ్రికా ఆల్రౌండర్ వియాన్ ముల్డర్ను SRH తీసుకుంది.
