ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి షాకిచ్చారు. ఇవాళ తెలంగాణ జనసేన నాయకులతో మీటింగ్ ఏర్పాటు చేశారు పవన్. అయితే పోలీసులు ఎలాంటి అనుమతి ఇవ్వలేదు. దీంతో సాయంత్రం ప్రెస్మీట్ పెడతా, అనుమతిస్తారో లేదో చూద్దాం అంటూ ఏపీ డిప్యూటీ సీఎం ట్వీట్ చేశారు.
పోలీసుల నిర్ణయంపై జనసేనాని పవన్ కల్యాణ్ తీవ్రంగా స్పందించారు. ఈ రోజు సాయంత్రం హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని నా నివాసంలోనే ప్రెస్మీట్ (పత్రికా విలేకరుల సమావేశం) ఏర్పాటు చేయబోతున్నాను. కనీసం నా సొంత ఇంట్లో ప్రెస్మీట్ పెట్టుకోవడానికైనా ఈ ప్రభుత్వం అనుమతి ఇస్తుందో లేదో చూద్దాం అని పవన్ కల్యాణ్ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.
తెలంగాణలో పార్టీని బలోపేతం చేసే దిశగా జనసేన శ్రేణులు ఈ ‘నవ నిర్మాణ సంకల్ప సభ’ను అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించాయి. సభ ఏర్పాట్లు కూడా పూర్తి కావస్తున్న తరుణంలో పోలీసులు పర్మిషన్ రిజెక్ట్ చేయడంతో జనసేన నాయకులు, కార్యకర్తలు తీవ్ర నిరాశకు గురయ్యారు.
పోలీసుల నిర్ణయాన్ని సవాలు చేస్తూ అత్యవసరంగా తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా కోర్టు నుంచైనా సానుకూల నిర్ణయం వస్తుందేమోనని ఆ పార్టీ నేతలు ఎదురుచూస్తున్నారు. పవన్ కల్యాణ్ నిర్వహించ తలపెట్టిన తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ సాయంత్రం 4 గంటలకు గచ్చిబౌలి వేదికగా జరగాల్సి ఉంది.

