కడప జిల్లా కమలాపురం నియోజకవర్గ పరిధిలో తీవ్ర కలకలం రేగింది. అధికార పక్షానికి చెందిన ఓ స్థానిక నేతపై గుర్తు తెలియని దుండగుడు కత్తితో ప్రాణాంతక దాడికి తెగబడ్డాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర భయాందోళనలను రేకెత్తించింది.
కమలాపురం పరిధిలోని తురకపల్లి గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ స్థానిక నాయకుడు రాజశేఖర్ రెడ్డి ఆదివారం ఉదయం తన నివాస ప్రాంతంలో ఫోన్ మాట్లాడుకుంటూ నడుస్తున్నారు. ఆయన ఫోన్ సంభాషణలో నిమగ్నమై ఉన్న విషయాన్ని గమనించిన ఓ గుర్తు తెలియని వ్యక్తి, ఒంటరిగా దొరికిన సమయం చూసి వెనుక వైపు నుంచి ఒక్కసారిగా కత్తితో దాడి చేశాడు.
రాజశేఖర్ రెడ్డి వీపు భాగంలో బలంగా పొడిచిన దుండగుడు ఆయన కింద పడిపోగానే అక్కడి నుంచి క్షణాల్లో పరారయ్యాడు. తీవ్ర రక్తస్రావమై అపస్మారక స్థితికి చేరుకున్న రాజశేఖర్ రెడ్డిని గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికులు వెంటనే అప్రమత్తమయ్యారు.
బాధితుడిని హుటాహుటిన చికిత్స నిమిత్తం ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ ఆయనకు అత్యవసర విభాగంలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కత్తిపోటు బలంగా పడటంతో గాయం తీవ్రత ఎక్కువగా ఉందని, అయితే ప్రాణాపాయం తప్పించేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నామని వైద్య వర్గాలు తెలిపాయి. బాధితుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
పాత కక్షల వల్ల ఈ దాడి జరిగిందా? లేదా ఏదైనా రాజకీయ విరోధాలు ఉన్నాయా? అనే కోణాల్లో పోలీసులు విచారణ జరుపుతున్నారు. నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించినట్లు త్వరలోనే అతడిని అరెస్ట్ చేస్తామని స్థానిక పోలీస్ అధికారి పేర్కొన్నారు.
