ప్రభాస్, రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన ‘బాహుబలి’ ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ ఫ్రాంఛైజీ నుంచి వస్తున్న యానిమేషన్ చిత్రం ‘బాహుబలి: ది ఎటర్నల్ వార్’ అంతర్జాతీయ స్థాయిలో మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది.
ఫ్రాన్స్లో ప్రతిష్ఠాత్మకంగా జరగనున్న ‘అన్నెసీ ఇంటర్నేషనల్ యానిమేషన్ ఫిలిం ఫెస్టివల్’లో ‘బాహుబలి: ది ఎటర్నల్ వార్’ చిత్రం ‘వర్క్ ఇన్ ప్రోగ్రెస్’ విభాగంలో ప్రదర్శనకు ఎంపికైంది. ఈ చిత్రానికి ఎస్.ఎస్. రాజమౌళి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ నెలాఖరులో జరగనున్న ఈ ఫెస్టివల్ కోసం నిర్వాహకులు టికెట్ బుకింగ్స్ ప్రారంభించగా, కేవలం రెండు నిమిషాల్లోనే టికెట్లన్నీ అమ్ముడయ్యాయి. బాహుబలి బ్రాండ్కు అంతర్జాతీయంగా ఉన్న క్రేజ్కు ఇది నిదర్శనంగా నిలిచింది.
గతంలో ఆస్కార్ గెలుచుకున్న ‘ఫ్లో’, ‘స్పైడర్మ్యాన్ ఇన్ టు ది స్పైడర్ వర్స్’ వంటి దిగ్గజ చిత్రాలు ఈ ఫెస్టివల్లోని ‘వర్క్ ఇన్ ప్రోగ్రెస్’ విభాగంలో ప్రదర్శితమయ్యాయి. ఇప్పుడు అదే జాబితాలోకి ‘బాహుబలి: ది ఎటర్నల్ వార్’ చేరడం విశేషం.
ఈ యానిమేషన్ చిత్రాన్ని దర్శకుడు ఇషాన్ శుక్లా రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర మొదటి భాగం టీజర్కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. యానిమేషన్ రూపంలో బాహుబలి ప్రపంచాన్ని మరోసారి చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వచ్చే ఏడాది ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది.
