త్వరలో బిగ్ అప్డేట్ ఉంటుందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై మాజీ మంత్రి కొండా సురేఖ స్పందించారు. తన పేరుతో వస్తున్న ఆ వార్తలను ఆమె పూర్తిగా ఖండించారు. కొండా సురేఖ పేరుతో ఉన్న ఫేస్బుక్ ఖాతాలో ‘‘త్వరలో బిగ్ అప్డేట్ ఉంటుంది. ‘వెయిట్ ఈజ్ ఆల్మోస్ట్ ఓవర్’..’’ అంటూ ఓ ఆసక్తికర పోస్టు వైరల్ అయింది. ఈ పోస్ట్ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.
దీనిపై కొండా సురేఖ సోషల్ మీడియా వేదికగా స్పష్టతనిచ్చారు. ఈ మేరకు ఆమె ఒక అధికారిక ప్రకటన విడుదల చేశారు. వివిధ సోషల్ మీడియా వేదికల్లో తన పేరుతో ప్రసారమవుతున్న పోస్టులతో తమ కుటుంబానికి గానీ, తనకు గానీ ఎలాంటి సంబంధం లేదని ఆమె స్పష్టం చేశారు.
మీడియా ప్రతినిధులు, ప్రజలు ఎవరూ కూడా అలాంటి అసత్య ప్రచారాలను నమ్మవద్దని కోరారు. కేవలం అధికారిక ఖాతాల ద్వారా వచ్చే సమాచారాన్ని మాత్రమే ప్రామాణికంగా తీసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. బర్తరఫ్ ఎపిసోడ్ తర్వాత ఆమె నుంచి ఏదైనా పెద్ద ప్రకటన వస్తుందని అందరూ ఎదురుచూస్తున్న తరుణంలో, ఈ ఫేస్బుక్ పోస్ట్ వైరల్గా మారడం గమనార్హం.
