క్రికెట్లో దేవుడు. కోట్ల మంది అభిమానాన్ని చూరగొన్న ప్రముఖుడు. కానీ చట్టసభల్లో మాత్రం అప్రతిష్ట మూటగట్టుకున్న వ్యక్తి. ఎన్నికైన ఐదేళ్ల తర్వాత కూడా ఒక్కనాడు చట్టసభలో మాట్లాడలేదు. నోరు తెరచి కనీసం క్రీడలకు సంబంధించిన అంశాలపైన కూడా నోరు మెదపలేదు. తనకు గౌరవంగా అప్పగించిన రాజ్యసభ సభ్యత్వాన్ని కేవలం హోదా కోసం.. అలంకరణ కోసం స్వీకరించినట్టు కనిపిస్తోంది. బాధ్యతలు స్వీకరించినప్పుడు మాత్రం ప్రమాణస్వీకారం సందర్భంగా చట్టసభలో మాట్లాడాడు. తర్వాత నిర్వహించిన పార్లమెంట్ సమావేశాల్లో ఏనాడూ నోరెత్తలేదు. మాట్లాడకపోయినా.. కనీసం సభకు సక్రమంగా వస్తే కదా. పార్లమెంట్ సమావేశాల్లో సచిన్ హాజరు కేవలం 20 శాతం కూడా లేదు.
క్రికెట్ దిగ్గజం, రాజ్యసభ సభ్యుడు సచిన్ తెందుల్కర్ తొలిసారిగా రాజ్యసభలో మాట్లాడారు. గురువారం జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో సచిన్.. ‘పిల్లలకు ఆడుకునే హక్కు’ అనే అంశంపై చర్చ లేవనెత్తారు. రాజ్యసభ ఎంపీగా నామినేట్ అయిన నాటి నుంచి సచిన్ సభలో ఓ అంశంపై చర్చ ప్రారంభించడం ఇదే తొలిసారి. 2012లో సచిన్ రాజ్యసభకు అప్పటి కాంగ్రెస్ (యూపీఏ) ప్రభుత్వం నామినేట్ చేసింది తెలిసిందే. అయితే ఆయన పార్లమెంట్ సమావేశాల్లో అప్పుడప్పుడు మాత్రమే కనిపిస్తుంటారు. సచిన్ హాజరుపై ఇప్పటికే పెద్ద వివాదం కూడా కొనసాగింది. మొత్తం నామినేట్ సభ్యులపై మిగతా సభ్యులు, స్పీకర్ కూడ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వతహాగా వచ్చిన సెలబ్రిటీల హాజరుశాతం తక్కువగా ఉందని.. అలాంటి వారిని పదవి నుంచి తప్పించాలని కూడా విమర్శలు వెల్లువెత్తున్నాయి.
ఈ నేపథ్యంలో తన పదవీ కాలం ముగిసే సమయంలో సచిన్ తొలిసారి నోరు విప్పాడు. ఇప్పుడు తానే స్వయంగా ఓ అంశంపై చర్చ జరిపేందుకు ముందుకు రావడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. పిల్లలకు చదువుతో పాటు ఆటలు కూడా ముఖ్యమేనని రాజ్యసభలో సచిన్ ప్రకటించారు. వారికి అవకాశాలు కల్పించాలని చట్టసభలో కోరాడు.