ఊహలు గుసగుసలాడే లాంటి సినిమాతో వచ్చి ఆకట్టుకుంటున్న యువ నటుడు నాగశౌర్య ప్రస్తుతం చలో సినిమాతో థియేటర్లలోకి వచ్చాడు. ఈ సినిమా విడుదలైన మొదటి షో నుంచే మంచి టాక్ సొంతం చేసుకుంది. కామెడీ ఎంటర్టైనర్గా, ఫీల్గుడ్ మూవీగా ఉండడంతో అందరి ప్రశంసలు పొందుతున్నాయి. 2018 సంవత్సరానికి తొలి హిట్ నాగశౌర్య ఛలోతో ఇచ్చాడని అందరూ చెబుతున్నారు. అయితే ఈ సినిమాకు ప్రముఖుల ప్రశంసలు అందుతున్నాయి.
అయితే ఈ సినిమా అందరికీ నచ్చడంతో క్యూబ్ లాక్ కీ కోసం ప్రముఖుల నుంచి ఫోన్లు వస్తున్నాయి. ఛలో సినిమాకు అలాంటి ఫోన్లు వరుసగా వస్తున్నాయట. అన్నింటికన్నా కీలకమైన ఫోన్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ కుటుంబం నుంచి వచ్చినట్లు తెలుస్తోంది. కేసీఆర్ ఫ్యామిలీ సినిమా చూడాలనుకుంటున్నారు. కీ ఇవ్వమని ఫోన్ వచ్చినట్లు సమాచారం. దీనితో పాటు జీఎంర్ వాసవీ గ్రూప్ అధినేత మల్లికార్జునరావు కుటుంబం కూడా ఈ సినిమాపై ఆసక్తి పెంచుకొని ఛలో క్యూబ్ కీ అడిగారంట. ఎన్టీవీ చౌదరి ఫ్యామిలీ నుంచి ఫోన్ వచ్చింది. ఇంకా పలువురు నుంచి ఫోన్లు వస్తున్నాయి.
ఈ విధంగా స్పందన రావడంతో చిత్రబృందం ఆనందంలో మునిగింది. ప్రముఖుల దృష్టిలో సినిమా టాక్ రావడంతో సినిమాకు ప్లస్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రవితేజ సినిమా వీక్గా ఉండడంతో ఛలో సినిమా ఇంకా పెరిగే అవకాశం ఉంది.
ఈ సినిమాను పూర్తిగా ఎన్నారైతో విక్రయించారు. విక్రయించిన రేట్లు పెద్దగా ఏమీ కావు. ఆంధ్ర జస్ట్ రెండున్నర కోట్ల రేషియోలో, సీడెడ్ కోటి రూపాయిల లోపునకే విక్రయించారు. నైజాం సొంతంగా విడుదల చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు మంచి వసూళ్లు వచ్చే అవకాశం ఉంది. నిర్మాత, నాగశౌర్య తల్లి ఉష మాల్పూరికి తొలి సినిమాతోనే మంచి కలెక్షన్లు వచ్చి శుభారంభం పలుకుతోంది.