సైబర్ నేరాలపై ఎంత అవగాహన కల్పిస్తున్నా.. ప్రజలు పట్టించుకోవడం లేదు. పోలీసులు, ప్రముఖులు, పలు స్వచ్ఛంద సంస్థలు వీటిపై ప్రచారం చేస్తూ ప్రచారం చేస్తున్నా తేరుకోవడం లేదు. ఇప్పుడు సైబర్ మోసాల బారిన ఆర్మీ మాజీ అధికారి పడ్డాడు. సైబర్ నేరగాళ్ల చేతిలో అక్షరాల రూ.కోటికి పైగా నగదు మోసపోయి చివరికి ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన సంఘటన హైదరాబాద్ సికింద్రాబాద్లో గురువారం చోటుచేసుకుంది.
ఏం జరిగింది అంటే..!
సికింద్రాబాద్ ప్రాంతానికి చెందిన విఠల్ మోహన్రావు రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి. ఈయన హైదరాబాద్, విశాఖపట్టణంలో అభిషేక్ ఇంజినీరింగ్ కాంట్రాక్ట్స్ పేరుతో వ్యాపారం చేస్తున్నారు. 2014లో ఆయన మెయిల్కు టర్కీ వెళ్లేందుకు లాటరీ వచ్చిందంటూ ఓ మెయిల్ వచ్చింది. దీంతో ఆయన తన వివరాలు అన్నీ పంపారు. కొన్నాళ్లకు అనుష్క అనే యువతి ఫోన్ చేసి షాప్చెర్రీ మార్కెటింగ్ తరఫున లాటరీ తీయగా టర్కీ ట్రిప్ వచ్చిందని, రూ.2.4 లక్షలు కట్టాలని చెప్పగా ఆయన చెల్లించాడు. ఆ తర్వాత ఫోన్ చేసి టర్కీ టూర్ ట్రిప్ వేరేవాళ్లకు వెళ్లింది కానీ మీకు రూ.17 లక్షల నగదు బహుమతి వచ్చిందని నమ్మించి రూ.3 లక్షలను షాప్చెర్రీ మార్కెటింగ్ ఖాతాలో కట్టించుకున్నారు. ఆ తర్వాత ఫోన్ చేసి ప్రైజ్మనీ రూ.17 లక్షల నుంచి రూ.33 లక్షలకు పెరిగిందంటూ మరో రూ.5 లక్షలు డిపాజిట్ చేయించారు. ఇంతటితో ఊరుకోకుండా ఆ తర్వాత అనుష్కతోపాటు రాయిల్ కపూర్ అనే వ్యక్తి ఫోన్ చేసి ప్రైజ్మనీ రూ.80 లక్షలకు పెరిగిందని నమ్మించి డీల్స్ బ్రోమ్ ఆన్లైన్ కంపెనీ, ఓం సాయి ఎక్స్పోర్ట్స్ కంపెనీ, మ్యాక్స్ ప్రాఫిట్ సొల్యూషన్, ఎఫ్జీఐ కార్పొరేషన్ కంపెనీల పేర్లతో ఫోన్చేసి వరుసగా రూ..17.2 లక్షలు, రూ.10 లక్షలు, రూ.9.2 లక్షలు, రూ.4.20 లక్షలను వేయించుకున్నారు. విఠల్ గుడ్డిగా మొత్తం రూ.87 లక్షలు చెల్లించాడు. అయితే ఇక్కడో మరో తిరకాసు ఉంది. ఈ ముఠా తమ తెలిని ప్రదర్శించి మరో రూ.29 లక్షలు వేయించుకోవడం ఆశ్చర్యమేస్తోంది.
రూ.87 లక్షలు వేయగా ఆ డబ్బునంతా తిరిగి ఇప్పిస్తామంటూ మరో రూ.29 లక్షలు కాజేసింది. దీంతో మొత్తం రూ.1.16 కోట్లు ఇచ్చేసి నిలువునా విఠల్ మోహన్రావు మోసపోయాడు. దీంతో కలత చెందిన మోహన్రావు ఎవరికీ చెప్పుకోలేక.. చెబితే పరువు పోతుందని భావించి ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు అతడిని వారించి సీసీఎస్ సైబర్క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఆ నేరంలో పాత్రధారులు, సంస్థలు వీరే
రాధాకిషన్ నాయర్, బత్రా (మహిళ, ఎఫ్జీఐ కార్పొరేషన్ మేనేజర్), వాల్తేర్ వాసు (ప్రాసెసిగ్ పర్సన్), మనీశ్ మల్హోత్రా (ఆర్థిక శాఖ), సునీల్ కత్రి (ఢిల్లీ క్రైమ్బ్రాంచ్ అధికారి), ఇండియా టుడే గ్రూప్, మ్యాక్స్ ప్రాఫిట్ సంస్థగా నేరస్తులు చెప్పుకున్నారు.