కృష్ణాజిల్లాలో జరుగుతున్న ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా వైఎస్ జగన్ మోహన్రెడ్డి నాయీ బ్రాహ్మణులకు వరాల జల్లులు కురిపించారు. ఈ సందర్భంగా స్థానిక కలవపూడి సత్రం దగ్గర రాష్ట్ర నాయీబ్రాహ్మణ ఆత్మీయ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో తమ సమస్యలను జననేతకు విన్నవించుకున్నారు.
వైసీపీ అధికారంలో కి వస్తే నాయీబ్రాహ్మణులకు సముచిత స్థానం కల్పిస్తామని, చట్టసభల్లో తగిన ప్రాధాన్యత ఇచ్చేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. నాయి బ్రాహ్మణులు లేకపోతే నాగరికత ముందు సాగలేదు. నేడు వీరు బతకలేని పరిస్థితి ఉంది. చిన్న కులం కావడంతో రాజకీయంగా ఎవరూ పట్టించుకోలేదు. క్షౌరశాలల్లో ఫ్యాన్లు, టూబ్లైట్లకు రూ. 8 నుంచి రూ. 14 వరకు కరెంట్ చార్జీలు వసూలు చేస్తున్నారు. కనీసం 4 వేల రూపాయలు కరెంట్ బిల్లు కట్టాలంటే ఎలా బతకాలని వాపోతున్నారు.
సెలూన్లకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తాం. 500 యూనిట్ల వరకు డొమెస్టిక్ టారీఫ్ ఉండేలా చూస్తాం. ప్రతి షాపుకు రూ. 10 వేలు ఉచితంగా ఇచ్చేందుకు సిద్ధం లేదా 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ రెండింటిలో ఒకటి అందిస్తాం. నాయి బ్రాహ్మణ ఫెడరేషన్ బదులుగా కార్పొరేషన్ ఏర్పాటు చేసి రుణాలు ఇప్పిస్తామని వారికి హామీలు ఇచ్చారు.
