అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను మావోయిస్టులు ఆదివారం కాల్చి చంపిన సంగతి తెలిసిందే. నిమిటిపుట్టిలో గ్రామదర్శిని కార్యక్రమానికి వెళ్తుండగా సుమారు 60 మంది వరకు మావోయిస్టులు ఇద్దరినీ చుట్టుముట్టారు. ఆ తర్వాత సుమారు 20 నిమిషాలు వారితో సమావేశం పెట్టి, హత్య చేశారు.
కొంతమంది బడా బాబులతో కలిసి నల్ల క్వారీలు నడపడం వల్లే ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేలను మావోయిస్టులు టార్గెట్ చేశారని తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విశాఖఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలపై పెద్ద వివాదమే నడుస్తోంది.
2015లో బాక్సైట్ తవ్వకాలపై ఏజెన్సీలో పెద్ద వివాదమే చెలరేగింది. బాక్సైట్ తవ్వకాలు నిలిపేయాలంటూ ఆదివాసీలతో పాటు మావోయిస్టులు కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. అంతేకాదు 2015 అక్టోబర్ 6న మావోయిస్టులు గిరిజన నేతలను మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. బాక్సైట్ తవ్వకాలను రద్దు చేయకపోతే తగిన మూల్యం చెల్లించుకుంటారని మావోలు హెచ్చరించారు.
జలతో కలిసి పెద్ద ఎత్తున నిరసన చేపట్టడంతో ప్రభుత్వం దిగొచ్చింది. జీవోను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఆ తర్వాత అక్టోబర్ 14న మావోయిస్టులు కిడ్నాప్ చేసిన టీడీపీ నేతలను మావోయిస్టులు ఒడిశాలోని చిత్రకొండ అటవీ ప్రాంతంలో అప్పగించారు.
అయితే ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలు క్వారీ నడపడంలో ఆరి తేరారని ప్రచారం ఉంది. హుకుంపేటలోని గూడ క్వారీ కిడారి సర్వేశ్వరరావు బావమరిది సురేష్ పేరు మీద ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్వారీ వల్ల తమకు నష్టం జరుగుతోందని గిరిజన ప్రాంతాల ప్రజలు ఆందోళన చేపట్టారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం ఏజెన్సీ ప్రాంతంలో పర్యటించారు. బాక్సైట్ తవ్వకాలను నిరసిస్తూ గ్రామస్థులకు మద్దతు పలికారు. మైనింగ్, భూకుంభకోణాలు, అక్రమ మైనింగ్ వ్యవహారాలలో మావోయిస్టులు సర్వేశ్వరరావును హెచ్చరించినట్లు తెలుస్తోంది. అయితే వాటిని పెడచెవిన పెట్టిన సర్వేశ్వరరావు గ్రామదర్శిని కార్యక్రమానికి వెళ్లడంతో కాపుకాసి హతమార్చినట్లు తెలుస్తోంది.