ఏపీ సీఎం చంద్రబాబుకు కాకినాడలో నిరసన సెగ తగిలింది. కాకినాడ జేఎన్టీయూలో జరుగుతున్న ‘జన్మభూమి-మా ఊరు’ కార్యక్రమానికి సీఎం వెళుతుండగా బీజేపీ నేతలు అడ్డుకుని నిరసన తెలిపారు. ఏపీ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పథకాల్లో అవినీతి జరుగుతోందంటూ బాబును ప్రశ్నించారు. ఈ సందర్భంగా బీజేపీ కార్యకర్తలు నేతలు, చంద్రబాబు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. అయితే సహనం కోల్పోయిన బాబు భాజాపా చెందిన ఓ మహిళా నేతపై నోరు పారేసుకున్నారు.
కొంచమైనా సిగ్గు ఉందా మీకు? మోదీ చేసిన పనులకు మీరంతా సిగ్గుపడాలి. మోదీ రాష్ట్రానికి ద్రోహం చేశారు. నన్ను డౌన్ డౌన్ అనడం కాదయ్యా. మీ అందరినీ జనాలు తరిమికొడతారు. లేనిపోని సమస్యలు పెట్టుకోవద్దు. మీరు ఫినిష్ అయిపోతారంటూ తన నోటికి పని చెప్పారు. బెదిరిస్తున్నారా అంటూ మహిళా నేత నిలదీయడంతో నాలుక కరుచుకున్న చంద్రబాబు తాను కాదు ప్రజలు కొడతారు అంటూ సర్ధిచెప్పుకునే ప్రయత్నం చేశారు.
ఆంధ్రప్రదేశ్కు మోదీ అన్యాయం చేశారని అలాంటి మోదీకీ మద్దతుగా మాట్లాడతారా అంటూ మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోరుతున్న వారిపై బీజేపీ ప్రభుత్వం నిన్న కూడా లాఠీ చార్జ్ చేయించిందని ఆ పార్టీ కార్యకర్తలని చెప్పుకునేందుకు కాస్తైనా సిగ్గుండాలంటూ మండిపడ్డారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో భాజాపా కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో గొడవ సద్దుమణిగింది.