కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ పొలిటికల్ ఎంట్రీ.. ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్. ప్రియాంక ఇప్పుడు ఏ పని చేసినా సెన్సేషనే. రాహుల్పై పూర్తి నమ్మకం లేకపోవడం.. కాంగ్రెస్ పార్టీపై దేశ ప్రజలంతా నిరాశగా ఉండటంతో ఇప్పటికిప్పుడు ఏమైనా అద్భుతం జరగాలన్నా.. దేశ ప్రజల నోళ్లల్లో కాంగ్రెస్ పేరు నానాలన్న ఆ పార్టీ నేతలకు కనిపించింది.. ప్రియాంకగాంధీ వాద్రా. అనుకున్నదే తడువుగా రాహుల్గాంధీ ఆమెను పార్టీ జనరల్ సెక్రటరీగా నియమించారు. అంతా అనుకున్నట్టే మీడియా మొత్తం ఆమెనే ఫోకస్ చేసింది. ప్రియాంక ఎంట్రీ కాంగ్రెస్ దశను మార్చబోతున్నదన్న చర్చ ప్రారంభమైంది. ఆమె ఏ చిన్న పని చేసినా దానిని మీడియా భూతద్దంలో చూపిస్తుంది.
ఆమె ఏం చేస్తుందా? ఏం మాట్లాడుతుందా? అని మైకులు పట్టుకుని చూస్తున్నారు. ప్రేక్షకులు కూడా ఆమె ఎప్పుడెప్పుడు ఏం మాట్లాడుతుందా అని ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో ప్రియాంక గాంధీ కార్యకర్తలు, ప్రజలతో మమేకం కావడానికి ట్వీటర్ అకౌంట్ ఓపెన్ చేశారని కాంగ్రెస్ మధ్యాహ్నం 12 గంటలకల్లా ప్రకటించింది. 15 నిమిషాల్లో 5వేలను దాటింది. ప్రియాంక ఇంతవరకూ ఒక్క ట్వీట్ కూడా చేయనప్పటికీ.. మధ్యాహ్నం 12.45 కల్లా ఆ సంఖ్య 24వేలకు చేరుకుంది. ఈ కథనం రాయడం ప్రారంభించే సమయానికి 60 వేల ఉన్న ఫాలోవర్ల సంఖ్య ముగిసే సరికి 66 వేలకు చేరుకుంది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.. ఆమెకు దేశంలో ఏ స్థాయిలో ఫాలోయింగ్ ఉందో. ప్రియాంక మాత్రం ఏడుగురిని ఫాలో అవుతున్నారు. రాహుల్గాంధీ, కాంగ్రెస్ సీనియర్ నేతలు అహ్మద్ పటేల్, రణ్దీప్ సుర్జేవాలా, అశోక్ గెహ్లోత్, సచిన్ పైలట్, జ్యోతిరాదిత్య సింధియా, కాంగ్రెస్ ఆఫిషియల్ ట్వీటర్ అకౌంట్లను ఆమె ఫాలో అవుతున్నారు.