వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై సంలచన వ్యాఖ్యలు చేశారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి . వివేకా హత్య కేసులో సూత్రధారులు సీఎం చంద్రబాబు నాయుడు, తనయుడు లోకేష్ అయితే చెయ్యించింది ఆదినారాయణ రెడ్డి అని సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ కుటుంబాన్ని సమూలంగా తుడిచిపెట్టడానికి కుట్రలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. 1998 నుంచి వైఎస్ కుటుంబాన్ని లేకుండా చేయాలని టీడీపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. 1998లో వైఎస్ రాజారెడ్డి హత్య కేసులో తెలుగుదేశం పార్టీ ప్రమేయం గురించి అందరికీ తెలిసిందేనని చెప్పుకొచ్చారు. 2009 ఆగష్టు 31న నిండు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు ఎవరు ఫినిష్ అయిపోతారో చూడండి అంటూ వ్యాఖ్యానించారని గుర్తు చేశారు. చంద్రబాబు ఫినిష్ అన్న రెండు రోజులకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించారని తెలిపారు. అక్టోబర్ 25న విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ లో ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై హత్యాయత్నం జరిగిందని గుర్తు చేశారు.
ఈ హత్య కేసులో మంత్రి ఆదినారయణ రెడ్డి పాత్ర స్పష్టంగా ఉన్నట్లు తెలుస్తోందన్నారు. ఆదినారాయణరెడ్డి మనిషి కాదు దుర్మార్గుడు. ఏ మాత్రం విలువల్లేని వ్యక్తి. సరిగ్గా చెప్పాలంటే మనిషి జాతిలో అతడు పుట్టడం పట్ల ప్రతి మనిషి బాధపడాల్సిన విషయం అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఆదినారాయణరెడ్డి చరిత్ర నేరాల దిట్టని…గతంలో అనేక అనేక హత్యలు చేయించారని ఆరోపించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తుపై తమకు నమ్మకంలేదని సీబీఐతో ఎంక్వయిరీ చేయించాలని విజయసాయి డిమాండ్ చేశారు.