ఎన్నికల ప్రాచారంలో వైసీపీ , టీడీపీ లు పోటా పోటీగా ప్రచారం చేస్తున్నాయి. అయితే టికెట్ రాని నేతలను సముదాయించడంలో ఇటు జగన్, అటు బాబు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడంలేదు. అసంతృప్త నేతలు మాత్రం దిగిరావడంలేదు. తాజాగా జగన్కు వైవీ సుబ్బారెడ్డి షాక్ ఇస్తె…బాబుకు మాజీ మంత్రి పీతల సుజాత షాక్ ఇచ్చింది.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకాశం జిల్లా ఎన్నికల ప్రచారానికి వైవీ సుబ్బారెడ్డి డుమ్మా కొట్టారు. ఒంగోలు ఎంపీ టికెట్ కేటాయించకపోవడమే కారణంగా తెలుస్తోంది. వైసీపీలో చేరిన మాగుంటకు ఎంపీ టికెట్ కేటాయించడంతో సుబ్బారెడ్డి అలక పాన్పు ఎక్కారు. గత కొద్ది రోజులుగా పార్టీ కార్యక్రమాలకు సుబ్బారెడ్డి దూరంగా ఉంటున్నారు. కొండెపి నియోజకవర్గంలో వైఎస్ జగన్ నిర్వహించిన ఎన్నికల ప్రచారసభకు వైవీ సుబ్బారెడ్డి రాకపోవడంపై రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఎమ్మెల్సీ లేదా రాజ్యసభ సభ్యత్వం ఇస్తానని వైవీ సుబ్బారెడ్డి వైఎస్ జగన్ హామీ ఇచ్చారని వార్తలు వచ్చాయి. అయితే ఆయన మాత్రం ఈ విషయంలో ఇంకా అసంతృప్తితోనే ఉన్నట్టు తెలుస్తోంది. ఎన్నికలు అయ్యేంత వరకు ఆయన విదేశాల్లో ఉండనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి వైవీ సుబ్బారెడ్డిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి బుజ్జగించే ప్రయత్నం చేస్తారా లేక ఆయనను లైట్ తీసుకుంటారా అన్నది చూడాలి.
బాబు పరిస్థితి కూడా అలానే ఉంది. పార్టీలో టికెట్ దక్కకపోవడంతో అలకబూనిన నేతలు ఇంకా దిగి రావడం లేదు. మాజీ మంత్రి పీతలు సుజాతకు బాబు టికెట్ నిరాకరించడంతో ఆమె అలకబూనారు. వారం రోజులుగా పార్టీకి, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బాబు చింతలపూడిలో నిర్వహించిన సభకు సుజాత డుమ్మా కొట్టారు. ఆమె చంద్రబాబు నాయుడు మీటింగ్ కు సైతం గైర్హాజరుకావడం చర్చనీయాంశంగా మారింది. అసంతృప్త నేతలను బుజ్జగించకపోతె రెండు పార్టీలకు డ్యామేజ్ తప్పదు.