ప్రముఖ టాలీవుడ్ హీరో డాక్టర్ రాజశేఖర్ కారు రోడ్డు ప్రమాదంకు గురైంది. ఈ ప్రమాదం నుంచి రాజశేఖర్ సురక్షితంగా తప్పిచుకున్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పెద్ద గోల్కొండ రోడ్ ఔటర్ రింగ్ రోడ్డులో మంగళవారం అర్దరాత్రి ఈ ఘటన జరిగింది. రామోజీఫిల్మ్ సిటీ నుంచి కారులో వస్తుండగా.. కారు టైర్ పగిలి డివైడర్ ను ఢీ కొట్టడంతో కారు పల్టీ కొట్టి ప్రమాదం జరిగింది.
కారులో ఉన్న ఎయిర్ బ్యాగ్స్ టైంకి ఓపెన్ కావడంతో ఆయన ఈ ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఇక కారులో రాజశేఖర్ ఒక్కరే ఉన్నారు. ప్రమాదం తర్వాత రాజశేఖర్ మరో కారులో వెళ్లిపోయారు. ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదని ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నట్లు ఫ్యామిలీ మెంబర్స్ చెప్పారు. ఇక ఈ ప్రమాదం గురించి రాజశేఖర్ మాట్లాడుతూ.. ’మగళవారం నైట్ రామోజీ ఫిల్మ్ సిటీ నుంచి వస్తుండగా ఔటర్ రింగ్ రోడ్డులో గోల్కొండ అప్పా జంక్షన్ వద్ద నా కారు ప్రమాదానికి లోనైంది. ఎదురుగా వస్తున్న కారులో వారు ఆగి.. నా కారు దగ్గరకు వచ్చి నన్ను గుర్తుపట్టి వెంటనే విన్ షీల్డ్ నుంచి బయటకు లాగారు.
ఆ తర్వాత వారి ఫోన్ నుంచి పోలీసులకు, నా ఫ్యామిలీకి సమాచారం అందించాను. వారి కారులోనే ఇంటికి వచ్చాను. నాకు ఎటువంటి గాయాలు కాలేదు’ అని చెప్పారు. ఇక క్రియేటివ్ ఎంటర్టైనర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ పతాకంపై జి. ధనుంజయన్ నిర్మిస్తున్న సినిమాలో ప్రస్తుతం రాజశేఖర్ నటిస్తున్నారు. ఎమోషనల్ థ్రిల్లర్గా రూపొందనున్న ఈ చిత్రానికి ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకుడు.