తమిళ నటి విజయలక్ష్మి, తానుంటున్న ఇంటి అద్దెను చెల్లించలేదన్న కారణంతో, ప్లాట్ మేనేజర్ ఆమె సామాన్లు బయట పడవేయడంతో, రోడ్డుపై ఆమె నానాయాగీ చేశారు. చెన్నైలోని టీనగర్ హబీబుల్లా రోడ్డులోని ఓ సర్వీసు అపార్ట్మెంట్లో విజయలక్ష్మి, ఆమె సోదరి నివాసం ఉంటున్నారు. కాగా, విజయలక్షి సోదరి అనారోగ్యం పాలైంది. దీంతో కొద్దిరోజులుగా ఆస్పత్రిలో ఉన్నారు. శనివారం(ఏప్రిల్ 24,2021) రాత్రి డిశ్చార్జ్ కావడంతో విజయలక్ష్మి ఇంటికి చేరుకున్నారు. ఇంటికి వచ్చి చూసి ఆమె షాక్ తిన్నారు.
తమ ప్లాట్లో మరో వ్యక్తి ఉండడంతో మేనేజర్ విఘ్నేశ్వరన్ను సంప్రదించారు. మూడు నెలలుగా అద్దె చెల్లించని దృష్ట్యా సామన్లు మరో గదిలో పెట్టినట్టు చెప్పారు. దీంతో ఆందోళన చెందిన విజయలక్ష్మి, మీడియాకు సమాచారం అందించారు. తన సామాన్లు బయట పడేశారని, రోడ్డున పడ్డానని ఆవేదన వ్యక్తం చేశారు. మీడియాను పిలిచి, తనను రోడ్డున పడేశారంటూ గొడవ మొదలు పెట్టిన ఆమె, నానా రభస చేసింది.
ఆ వెంటనే మీడియా ముందుకు వచ్చిన మేనేజర్, విజయలక్ష్మి సామాన్లను తామేమీ బయట పడేయలేదని, ఓ గదిలో ఉంచామని, ప్లాట్ సిబ్బందిని కొట్టడంతో పాటు, అద్దె చెల్లించని కారణంగా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు. విజయలక్ష్మి వద్దకు వచ్చిన తేనాంపేట పోలీసులు, ఆమెతో మాట్లాడి, టెంపరరీగా మరో ప్రాంతంలో ఆశ్రయం కల్పించారు.
గతంలో నామ్ తమిళర్ కట్చి నేత, నటుడు, దర్శకుడు సీమాన్ తనను మోసం చేశారంటూ గతంలో నటి విజయలక్ష్మి తీవ్ర ఆరోపణలు చేశారు. ఆత్మహత్యాయత్నాలు చేయడం వంటి పరిణామాలు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల సీమాన్కు వ్యతిరేకంగా పనిచేశారు. ఈ నేపథ్యంలో ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు కూడా ఆమెను చుట్టుముట్టాయి.