టాలీవుడ్ స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ కాలేయ వ్యాధితో బాధపడుతున్న ఏడు నెలల పసికందు వైద్యానికి భారీ విరాళమిచ్చాడు. విషయంలోకి వెళ్తే.. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన పి.నితీశ్ బిలైరీ అత్రేసియా అనే వ్యాధితో బాధపడుతున్నారు. అయితే.. అపోలో హాస్పిటల్స్ కు చెందిన వైద్యుల బృందం నితీశ్ కు ఆపరేషన్ చేసింది. ఈ టీమ్ కు డాక్టర్ మనీశ్ సి వర్మ హెడ్ గా ఉన్నాడు. 15 వేల మందిలో ఒకరికి వస్తుంది ఈ వ్యాధి. ఏడు నెలల 13 రోజులున్న నితీశ్ బరువు 5.5కేజీలు.
తొలుత కామెర్లు రావడంతో స్థానికంగా వైద్యులను చూపించి చికిత్స చేయించారు. అయినా ఫలితం లేకపోయింది. చివరికి హైదరాబాద్ ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పరీక్షలు చేయడంతో బిలియరీ అట్రీసియా తేలింది. అత్యవసరంగా కాలేయ మార్పిడి చేయాలని అక్కడి వైద్యులు సూచించారు. రెక్కాడితే కాని డొక్కాడని ఆ తల్లిదండ్రులు తమ చిన్నారిని ఆదుకోవాలని మీడియా ద్వారా అభ్యర్థించారు. దాతల ద్వారా నిధులు సమకూరడంతో అపోలో వైద్యులను సంప్రదించారు.
నితీశ్ తండ్రి నాగరాజు నుంచి 15 శాతం వరకు కాలేయాన్ని తీసి చిన్నారికి అమర్చామని మనీష్ సి.వర్మ చెప్పారు. ఆరు నెలల వయస్సు, కేవలం అయిదు కేజీల బరువు ఉండే పిల్లలకు కాలేయ మార్పిడి చాలా అరుదైన విషయమని.. చిన్నారి పూర్తిగా కోలుకోవడంతో డిశ్చార్జి చేసినట్లు తెలిపారు. ఈ చికిత్సకు మొత్తం 25 లక్షలు అవసరం అవ్వగా.. మీడియా ద్వారా ఈ వార్తను తెలుసుకున్న అల్లు అర్జున్ రూ.8 లక్షల ఆర్థిక సాయం చేసి ఆదుకున్నారు. ఏపీ ముఖ్యమంత్రి సహాయక నిధి ద్వారా రూ.10 లక్షలు, కేంద్ర ప్రభుత్వం నుంచి మరో రూ.3 లక్షలతోపాటు మిగతా దాతలు కూడా తలో చేయివేసి చిన్నారి ప్రాణాలను నిలబెట్టారు.
Related
