బుల్లితెరపై తనదైన యాంకరింగ్ తో తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరయ్యాడు యాంకర్ ప్రదీప్ మాచిరాజు. ప్రస్తుతం బుల్లితెర, వెండితెరపై వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. గత ఏడాది నుంచి కరోనా కాటులకు ఎంతో మంది సెలబ్రెటీలు.. వారి కుటుంబ సభ్యులు కన్నుమూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే యాంకర్ ప్రదీప్ తండ్రి కరోనా కారణంగా మూడు వారాల క్రితం చనిపోయిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి యాంకర్ ప్రదీప్ ఎంతో డిప్రెషన్ కి లోనయ్యారు. తాజాగా తన తండ్రిని మిస్ అవుతూ పోస్టు చేశాడు.
తన జీవితంలో కీలక పాత్ర పోషించిన తండ్రిని ఎప్పటికీ మిస్ అవుతూనే ఉంటానని.. తండ్రికి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటానని సోషల్ మీడియా వేదికగా వెలిబుచ్చారు. ఐ లవ్ యు నాన్న తాను ఇప్పటికి ఇలా ఉన్నానంటే దానికి తన తండ్రి కారణమన్నారు. జీవితంలో ఎలాంటి కష్టాలు వచ్చిన చిరునవ్వుతో ఎదుర్కునేలా తర్పీదు ఇచ్చారని గుర్తు చేశారు. సంఘంలో మీకు గౌరవం కలిగించేలా నడుచుకుంటానని, తన ప్రతి నిర్ణయం వెనుక ఎలప్పుడు అండగా ఉన్నారని కొనియాడారు.
నేను తీసుకున్న తప్పుడు నిర్ణయాలకు బాధతో ముక్కలైన మనస్సును ప్రేమతో బాగు చేశారు.మీ ధైర్యం నాకు స్ఫూర్తినిచ్చింది. నా కాళ్లపై నిలబడేలా చేసింది. మీరు నాకెప్పటికీ స్పెషల్. జీవితంలో నేను ఎలా ఉన్నా మిమ్మల్ని గుర్తుంచుకుంటాను. తెలుగు ప్రేక్షకులను ఎప్పుడూ ఎంటర్టైన్ చేస్తూ నవ్విస్తూనే ఉంటానని, మనం కలిసే దాకా మిమ్మల్ని మిస్ అవుతానని, ఐ మిస్ యు డాడీ అంటూ ప్రదీప్ బాధతప్త హృదయంతో తెలియజేశాడు.