విశ్వ విఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు జీవిత నేపథ్యంలో దర్శకుడు క్రిష్ ఎన్టీఆర్ అనే సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. రెండు దఫాలుగా రానున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఇప్పటికే ఎన్టీఆర్ సినిమాలోని ముఖ్య పాత్రల కోసం పలువురు స్టార్స్ని ఎంపిక చేసిన చిత్ర బృందం అనుష్క శెట్టిని కూడా కీలక పాత్ర కోసం సెలక్ట్ చేశారట.
జనవరి 9న తొలిభాగం ‘ఎన్టీఆర్ – కథానాయకుడు’ విడుదల కానుండగా, బీ సరోజాదేవి పాత్రలో అనుష్క నటిస్తున్నట్టు సమాచారం.యన్.టి.ఆర్ సరసన బి. సరోజాదేవి చాలా చిత్రాల్లో కలిసి నటించారు. అందులో చాలా వరకు సూపర్ హిట్ చిత్రాలుగా నిలిచాయి. ఆ చిత్రాలకు సంబంధించిన కొన్ని విషయాలను ఈ బయోపిక్లో చూపిస్తున్నారట.ఈ క్రమంలో సరోజా దేవి పాత్ర కోసం అనుష్కని తీసుకున్నారట.అతి త్వరలో ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించనున్నారని అంటున్నారు.
అనుష్క చివరిగా భాగమతి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాగా, ఆ మూవీ తర్వాత ఏ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడం విశేషం. ఈ సన్నివేశాల చిత్రీకరణ పూర్తికాగానే, అనుష్క ఫస్ట్ లుక్ స్టిల్ విడుదల అవుతుందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఇక సరోజాదేవి పాత్రలో అనుష్క నటించే విషయమై అధికారిక ప్రకటన వెలువడాల్సి వుంది.