యంగ్ టైగర్ ఎన్టీఆర్ ,మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న సినిమా అరవింద సమేత.పూజా హెగ్డె,ఈషా రెబ్బాలు హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను చినబాబు నిర్మించారు.చాలా రోజుల తరువాత తెలుగు తెర మీద మళ్లీ ఫ్యాక్షన్ కథతో వస్తున్నాడు ఎన్టీఆర్. అజ్ఞాతవాసి వంటి ప్లాప్ తరువాత త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో సినిమాపైఅంచనాలు భారీగా పెరిగాయి.ఇక ఈ సినిమా ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.మరి సినిమా ఎలా ఉందో రివ్వూ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండీ.
కథ : ‘అరవింద సమేత వీర రాఘవ’ నల్లగుడి, కొమ్మడి అనే రెండు గ్రామాల మధ్య జరిగే ఫ్యాక్షన్ కథ. నల్లగుడి ఊరి పెద్ద బాసి రెడ్డి(జగపతి బాబు), కొమ్మద్ది ఊరి పెద్ద నారప రెడ్డి (నాగబాబు). ఓ చిన్న గొడవ కారణంగా రెండు గ్రామాల మధ్య వైరం మొదలవుతుంది. అదే సమయంలో నారపరెడ్డి కుమారుడు వీర రాఘవ రెడ్డి(ఎన్టీఆర్) లండన్ నుంచి ఊరికి వస్తాడు. కొడుకు ఇంటికి తీసుకెళ్తుండగా ఓబా దాడి చేసి నారప రెడ్డిని చంపేస్తాడు. ఫ్యాక్షన్కు దూరంగా ఉండాలనుకున్న వీర రాఘవ హైదరాబాద్ వెళ్లిపోతాడు. అక్కడే అరవింద(పూజా హెగ్డే) తో ప్రేమలో పడతాడు. అరవిందను ఓ ప్రమాదం నుంచి కాపాడటంతో కథ మలుపు తిరుగుతుంది. అరవింద సాయంతో రెండు గ్రామాల మధ్య గొడవలను, కక్షలను చల్లార్చేందుకు ప్రయత్నిస్తాడు. ఈ ప్రయత్నంలో వీర రాఘవకు ఎదురైన సమస్యలేంటి..? అన్నదే మిగతా కథ.
నటీనటులు : ఎన్టీఆర్ సినిమా అంటేనే వన్ మెన్ షోలా సాగుతుంది. ఈ సినిమా కూడా అందుకు మినహాయింపేమి కాదు. చాలా మంది నటీనటులు ఉన్నా.. ఎన్టీఆర్ అంతా తానే అయ్యి సినిమాను నడిపించాడు. ఎమోషన్స్, యాక్షన్, రొమాన్స్ ఇలా ప్రతీ భావాన్ని అద్భుతంగా పలికించాడు. అంతేకాదు రాయలసీమ యాసలో డైలాగ్స్ చెప్పేందుకు ఎన్టీఆర్ చూపించిన డెడికేషన్ స్క్రీన్ మీద కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది, వినిపిస్తుంది. లుక్స్పరంగానూ ఎన్టీఆర్ పడిన కష్టం సినిమాకు ప్లస్ అయ్యింది. హీరోయిన్గా పూజా హెగ్డే ఆకట్టుకుంది. నటనకు పెద్దగా ఆస్కారం లేకపోయినా కథను మలుపు తిప్పే కీలక పాత్రలో ఆమె ఆకట్టుకుంటుంది. గ్లామర్ పరంగానూ మంచి మార్కులు సాధించింది. విలన్ పాత్రలో జగపతి బాబు జీవించాడు. లుక్స్ పరంగానూ భయపెట్టాడు. యంగ్ హీరో నవీన చంద్ర తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. కమెడియన్గా టర్న్ అయిన సునీల్ తనదైన టైమింగ్తో కాసేపు నవ్వించే ప్రయత్నం చేశాడు. నాగబాబుకు చాలా కాలం తరువాత మంచి పాత్ర దక్కింది. రావూ రమేష్, దేవయాని, సుప్రియా పాతక్, ఈషా రెబ్బా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.
విశ్లేషణ : త్రివిక్రమ్, ఎన్టీఆర్ కాంబినేషన్లో సినిమా వస్తుందంటేనే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలకు తగ్గట్టు అన్ని ఎలిమెంట్స్ ఉండేలా ఓ పర్ఫెక్ట్ ఫ్యాకేజ్తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు త్రివిక్రమ్. అభిమానులు తన నుంచి ఎక్స్పెక్ట్ చేసే డైలాగ్స్ ఎమోషన్స్తో పాటు, ఎన్టీఆర్ మార్క్ మాస్ ఎలిమెంట్స్ కూడా మిస్ అవ్వకుండా జాగ్రత్త పడ్డాడు. ఎన్టీఆర్ను అభిమానులు ఏ స్థాయిలో చూడాలనుకుంటున్నారో అంతకు మించి చూపించే ప్రయత్నం చేశాడు. అయితే రొటీన్ కథ కావటంతో కొంత నిరాశ కలిగిస్తుంది. త్రివిక్రమ్ గత చిత్రాలతో పోలిస్తే ఎంటర్టైన్మెంట్ కూడా తక్కువే. తొలి ఇరవై నిమిషాల్లో సినిమాను ఎక్కడికో తీసుకెళ్లినా తరువాత ఆ వేగం కనిపించలేదు. ముఖ్యంగా లవ్ స్టోరి సాగదీసినట్టుగా అనిపిస్తుంది. అయితే త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్, టేకింగ్ అలరిస్తాయి. ద్వితీయార్థం ఎమోషనల్ సీన్స్తో భారంగా సాగుతుంది. ప్రీ క్లైమాక్స్ నుంచి తిరిగి వేగం అందుకుంటుంది.
సాంకేతిక పరిజ్ఞానం: తమన్ సంగీతం సినిమాకు మరో ప్లస్ పాయింట్. పాటలతో రిలీజ్కు ముందే ఆకట్టుకున్న తమన్.. నేపథ్య సంగీతంతో సినిమా రేంజ్నే మార్చేశాడు. యాక్షన్, ఎమోషనల్ సీన్స్ లో తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సూపర్బ్. పీఎస్ విందా సినిమాటోగ్రపి సినిమాకు మరో ఎసెట్. రాయలసీమ వాతావరణాన్ని కళ్లకు కట్టినట్టుగా తెర మీద ఆవిష్కరించాడు విందా. ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.
బోటమ్ లైన్: ఎన్టీఆర్నే డామినేట్ చేసిన జగ్గుభాయ్