- అందరూ సెటిలైన తర్వాత పరిశ్రమ తరలించే అవకాశం
- బాలకృష్ణ ఓ స్టూడియో నిర్మిస్తున్నారట
తెలుగు రాష్ట్రం రెండు రాష్ట్రాలుగా ఏర్పడి దాదాపు నాలుగేళ్లవుతోంది. విభజన సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదు. కొన్ని ఉమ్మడి ఆస్తులు ఉన్నాయి. కొన్ని సంస్థలు ఇంకా విభజన జరగలేదు. కేంద్ర అపరిష్కృతంగా విభజించడంతో విభజన సమస్యలు ఇంకా ఓ కొలక్కి రాలేదు. అందులో భాగంగా తెలుగు సినీ పరిశ్రమ కూడా విభజన జరగాలని కొందరు భావిస్తున్నారు. మద్రాస్ నుంచి తెలుగు సినీ పరిశ్రమ హైదరాబాద్ రావడానికి ఎన్నో ఏళ్లు పట్టింది. ఎంతో కష్టనష్టాలతో ఆ సినిమా పరిశ్రమ భాగ్యనగరానికి వచ్చి కొలువైంది.
అయితే ఇప్పుడు దశాబ్దాల తర్వాత తెలుగు సినీ పరిశ్రమ మళ్లీ రెండు ముక్కలు అయ్యే అవకాశం ఉంది. దానికనుగుణంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లోలోపల చర్యలు తీసుకుంటోంది. హైదరాబాద్లో ప్రశాంతంగా కొనసాగుతున్న పరిశ్రమను తరలించాల్సిన అవసరం ఏమొచ్చింది. తెలంగాణ ప్రభుత్వం తెలుగు సినీ పరిశ్రమకు వెన్నుదన్నుగా నిలుస్తోంది. ఎక్కడా ఇబ్బందులకు గురి చేయడం లేదు. ఈ నేపథ్యంలో తరలించాల్సి ఎందుకు వస్తోందో తెలియడం లేదు.
అయితే ఒక్కసారిగా తరలించకుండా తమ బంధువులు, సంబంధీకులు ఆస్తులు, స్టూడియోలు, థియేటర్లు నిర్మించుకున్న తర్వాత సినీ పరిశ్రమను తరలిస్తే వారి వర్గం వారికి కలిసొచ్చే అవకాశం ఉంటుందని పక్క రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు. అందులో భాగంగా ఏపీ ప్రభుత్వ పెద్దలు ప్రవర్తిస్తున్నారు. ఈ విషయమై ఏపీ సీఎం బామ్మర్ది, ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ స్పందించారు. సినీ పరిశ్రమ పూర్తిగా అక్కడికి తరలిపోవాల్సిన అవసరం లేదని బాలయ్య స్పష్టం చేశారు. ఇప్పుడు ఇక్కడున్నవి రెండూ తెలుగు రాష్ట్రాలే. తెలంగాణ అన్నామన తెలుగువాళ్లే కదా. రెండు తెలుగు రాష్ట్రాలు చిత్ర పరిశ్రమకు రెండు కళ్లు. కాబట్టి పరిశ్రమ తరలివెళ్లాల్సిన అవసరం లేదు. ఎవరిష్టం వాళ్లది. ఐతే నేను మాత్రం ఆంధ్రప్రదేశ్లో ఒక స్టూడియో నిర్మిస్తాను’’ అని బాలయ్య చెప్పాడు.
అయితే ఈపాటికే దగ్గుబాటి సురేశ్బాబు అమరావతి సమీపంలో ఓ స్టూడియో నిర్మించే ఆలోచనలో ఉన్నారు. ఇప్పుడు బాలయ్య స్టూడియో నిర్మిస్తుండడంతో పెద్దపెద్ద వాళ్లు తమ పని కానిచ్చేస్కున్న తర్వాత సినీ పరిశ్రమను తరలించే ప్రయత్నంలో ఉన్నారని తెలుస్తోంది.