ఈ మధ్యకాలంలో టాలీవుడ్ లో పలు విషాద ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవలే ప్రముఖ నటుడు గొల్లపూడి మారుతిరావు మరణం సినీ లోకంలో విషాదం నింపగా.. ఈ విషయం మరవకముందే కమెడియన్ అలీ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే… కమెడియన్ ఆలీ తల్లి జైతున్ బీబీ మరణించారు. గత కొంతకాలంగా తీవ్ర ఆనారోగ్యంతో బాధపడుతున్న ఆమె రాజమహేంద్రవరంలోని తన స్వగృహంలో కన్నుమూశారు. ఆలీ తల్లి మరణవార్త తెలిసి సినీ పరిశ్రమలోని ఆయన సన్నిహిత వర్గాలు కలత చెందాయి. ప్రస్తుతం ఆలీ ఓ షూటింగ్ నిమిత్తం రాంచీ వెళ్లారు. అక్కడ షూటింగ్లో పాల్గొంటున్న ఆయనకు ఈ వార్త తెలిసి హుటాహుటిన హైదరాబాద్ బయలు దేరారు.
మరోవైపు ఆలీ తల్లి జైతున్ బీబీ భౌతికకాయాన్ని కూడా రాజమండ్రి నుంచి హైదరాబాద్ తీసుకొచ్చేనందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గురువారం సాయంత్రం హైదరాబాద్లోనే ఆలీ తల్లి అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని సమాచారం. ఆలీకి తన తల్లిదండ్రులంటే చాలా ప్రేమ ఉండేది. కమెడియన్ ఆలీ తల్లి మరణ వార్త తెలుసుకున్న పలువురు సినీ, రాజకీయ ప్రముఖలు తమ తమ సంతాపం వ్యక్తం చేస్తున్నారు.