కొలీవుడ్ అగ్ర హీరో ధనుష్ వరుస విజయాలతో దూసుకెళ్తున్నాడు. ఆయన నటించిన అసురన్, కర్ణన్ వరుసగా సూపర్ హిట్ సాధించాయి. ప్రస్తుతం ఆయన నటిస్తున్న జగమే తంతిరం విడుదలకు సిద్ధంగా ఉంది. గ్యాంగ్ స్టర్ కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఏడాది కిందటే షూటింగ్ పూర్తి చేసుకుంది. అయితే కరోనా కారణంగా పలుమార్లు విడుదల వాయిదా పడింది.
ఈ సినిమాను థియేటర్లలోనే విడుదల చేయాలని మొదట మేకర్స్ భావించి రోజులపాటు ఎదురు చూశారు. అయితే ఇప్పటికే విడుదల ఆలస్యం కావడంతో పాటు, థియేటర్లు తెరుచుకోవడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉండడంతో ఈ సినిమాని నేరుగా ఓటీటీ ద్వారా విడుదల చేయాలని నిర్ణయించారు. నెట్ ఫ్లిక్స్ ద్వారా ఈనెల 18వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. మొత్తం 196 దేశాల్లో నెట్ ఫ్లిక్స్ ఈ సినిమా ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది.
తమిళ, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ, ఇంగ్లీష్, ఫ్రెంచ్, జర్మన్, ఇటాలియన్ ఇలా మొత్తం 17 భాషల్లో జగమే తంతిరం విడుదల కానుంది. ఇన్ని దేశాల్లో ఇన్ని భాషల్లో ఒక్క సినిమా విడుదల కావడం రికార్డే. ఇదే మొదటిసారి కూడా. ఈ సినిమాను కార్తీక్ సుబ్బరాజు మాస్ ఎంటర్ టైనర్ గా మలిచారు. జగమే తంతిరం సినిమాను రిలయన్స్ ఎంటర్టైన్మెంట్, వై నాట్ స్టూడియోస్ కలిసి సంయుక్తంగా నిర్మించాయి. ఈ సినిమాకు తెలుగులో జగమే తంత్రం అనే పేరు పెట్టారు. ఇదే పేరుతో నెట్ ఫ్లిక్స్ లో విడుదల కానుంది.
Also Read
అదిరిపోయే శుభాకాంక్షలు చెప్పిన చిరు.. కొరటాలకు మరుపురాని కానుక!