సినీనటుడు అలీపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అలీ వైసీపీ లో చేరిన తర్వాత పవన్ ఈ స్థాయిలో మాట్లాడం ఇదే మొదటిసారి. సోమవారం నాడు రాజమండ్రిలో నిర్వహించిన ఎన్నికల సభలో పవన్ కళ్యాణ్ ఈ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అలీ వంటి వ్యక్తుల వల్ల మనుషులపై నమ్మకం పోతుందని అన్నారు. ఆయన కష్టాల్లో ఉన్నప్పుడు అండగా ఉన్నానని, తనతో కలిసి పనిచేస్తానన్న అలీ చెప్పకుండానే వైకాపాలోకి వెళ్లిపోయారన్నారు.
అలీ చెప్పిన వాళ్లకు టిక్కెట్ ఇచ్చినా తనను వదిలి వెళ్లాడని ఆవేదన వ్యక్తంచేశారు. తాను ఎన్నికల్లో రాణించలేనని ఎలా అనుకుంటారని, ‘అక్కడ అమ్మాయి, ఇక్కడ అబ్బాయి’ సినిమాతో స్టార్ అవుతానని ఎవరైనా అనుకున్నారా అని పవన్ ప్రశ్నించారు. అవసరంలో తాను ఆదుకున్న అలీ లాంటి వాడే వదిలేస్తే ఇంకా ఎవరిని నమ్మాలన్నారు. అలీ లాంటి వారి వల్ల.. ప్రజలను తప్ప బంధుమిత్రులను కూడా నమ్మడం లేదన్నారు. వైకాపా అధ్యక్షుడు జగన్ ఓటుకు రూ.2వేలు ఇచ్చి కొనుగోలు చేస్తున్నారని, అలీని జగన్ వాడుకొని వదిలేశారని పవన్ ఆరోపించారు.