దివంగత నటుడు,టీడీపీ మాజీ ఎంపీ హరికృష్ణ కూతురు సుహాసిని తెలంగాణ ఎన్నికలలో కూకట్పల్లి నియోజిక వర్గం నుంచి పోటీ చేస్తున్న విషయం అందరికి తెలిసిందే.శనివారం బాలయ్యతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు సుహాసిని.సుహాసినికి మద్దతుగా నిలిచారు నందమూరి కుటుంబం.హరికృష్ణ కొడుకు హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తమ సోదరిని అఖండ మెజారిటీతో గెలిపించాలి అని విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా ఆయన ఓ లేఖను కూడా విడుదల చేశారు. ప్రజా సేవకు సిద్దపడుతున్న తమ సోదరి సుహాసిని భారీ విజయం సాధించాలని ట్విటర్ వేదికగా ఆకాంక్షించారు. మరో హీరో కల్యాణ్ రామ్ కూడా సుహాసినిని ఆశీర్వదించాలని కోరారు.
తొలి సారి ఎన్నికల బరిలోకి దిగుతున్న నందమూరి సుహాసిని తాత, దివంగత సీఎం ఎన్టీఆర్, తండ్రి నందమూరి హరికృష్ణలకు నివాళులర్పించి వారి ఆశీర్వాదం తీసుకున్నారు. తండ్రి సమాధి వద్దే నామినేషన్ పత్రాలపై సంతకం చేశారు. కుటుంబ సభ్యులు, నందమూరి బాలకృష్ణలతో తొలుత ఎన్టీఆర్ ఘాట్కు వెళ్లిన ఆమె.. అనంతరం మహాప్రస్థానంలోని తన తండ్రి సమాధి దగ్గరకు వెళ్లి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సుహాసిని మీడియాతో మాట్లాడుతూ.. ఎన్టీఆర్, హరికృష్ణ, బాలకృష్ణ, చంద్రబాబుల స్పూర్తితో రాజకీయాల్లోకి వస్తున్నట్లు చెప్పారు. తనకు తెలుగు మహిళలు మద్దతు ఇవ్వాలని కోరారు.